HYD : మద్యం డబ్బుల కోసం గొడవ.. తండ్రికి నిప్పు
ABN , First Publish Date - 2021-11-18T12:12:13+05:30 IST
HYD : మద్యం డబ్బుల కోసం గొడవ.. తండ్రికి నిప్పు
హైదరాబాద్ సిటీ/రాయదుర్గం : తాగుడుకు బానిసై తండ్రితో గొడవపడి కిరోసిన్ పోసి నిప్పంటించాడు ఓ ప్రబుద్ధుడు. గచ్చిబౌలి పీఎస్ పరిధిలోని ఇందిరానగర్లో బుధవారం ఈ ఘటన వెలుగుచూసింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన దుర్గారావు ఇందిరానగర్లో నివాసముంటున్నాడు. కొన్నేళ్లుగా అనారోగ్యంతో ఇంటివద్దే ఉంటున్నాడు. అతడి పెద్దకుమారుడు నాగబాబు గచ్చిబౌలిలో తోటమాలి. జీతం తల్లికి ఇస్తుంటాడు. ఇటీవల తాగుడుకు బానిసై మద్యానికి డబ్బులు కావాలని తల్లిదండ్రులను వేధిస్తున్నాడు. మంగళవారం డబ్బుల విషయమై తండ్రి దుర్గారావుకు, నాగబాబుకు గొడవ జరిగింది. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న కిరోసిన్ తండ్రిపై పోసి నిప్పటించాడు. తీవ్రగాయాలైన దుర్గారావును ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా, అక్కడ మృతిచెందాడు. చిన్న కుమారుడు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.