తల్లి మందలించిందని కుమారుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-05-25T05:20:30+05:30 IST

తల్లి మందలించిందని కుమారుడి ఆత్మహత్య

తల్లి మందలించిందని కుమారుడి ఆత్మహత్య

  •  కొడుకు మరణం తట్టుకోలేక తల్లి ఆత్మహత్యాయత్నం

కీసర రూరల్‌, మే24 (ఆంధ్రజ్యోతి): తల్లి మందలించిందని కుమారుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోగా.. కుమారుడి మరణాన్ని తట్టుకోలేక తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కీసర పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. కీసరకు చెందిన దాసరి భిక్షపతి, పుష్పవతిలకు ఇద్దరు కుమారులు. కాగా, శివ(25) చిన్నవాడు.. పాల వ్యాపారం చేస్తుంటాడు. అయితే, వారి కుటుంబం గడవడానికి అప్పులు చేశారు. ఈక్రమంలో అప్పు తీసుకున్న డబ్బులు చెల్లించే విషయంలో తల్లి, కుమారుడి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో మనస్తాపం చెందిన శివ సోమవారం అర్ధరాత్రి తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు హుటాహుటిన పొలం వద్దకు పరిగెత్తారు. చెట్టుకు వేలాడుతున్న కుమారుడిని చూసిన తల్లి పుష్పవతి తట్టుకోలేక పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, శివ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించారు.  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ రఘువీర్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2022-05-25T05:20:30+05:30 IST