వారం వ్యవధిలోనే తండ్రీకొడుకులు మృతి

ABN , First Publish Date - 2021-05-12T07:10:13+05:30 IST

తండ్రి మరణవార్త తెలియకుండానే కొడుకు మృతిచెందిన విషాద ఘటన మండలంలోని బొమ్మిరెడ్డిపల్లిలో మంగళవారం జరిగింది.

వారం వ్యవధిలోనే తండ్రీకొడుకులు మృతి

కనిగిరి, మే 11 : తండ్రి మరణవార్త తెలియకుండానే కొడుకు మృతిచెందిన విషాద ఘటన మండలంలోని బొమ్మిరెడ్డిపల్లిలో మంగళవారం జరిగింది. రామాలయం అర్చకుడు, ప్రైవేటు ఉపాధ్యాయుడు మారెళ్ల ప్రసాద్‌రావు (60) అనారోగ్యంతో మృతి చెందారు. ప్రసాద్‌రావు తండ్రి ఈనెల 7న మృతి చెందారు. అయితే అప్పటికే ప్రసాదరావు ఆరోగ్యం  పరిస్థితి కూడా సీరియస్‌గా ఉండడంతో గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. దీంతో ఆయన మరణించారన్న వార్త ఆయనకు తెలియజేయాలేని పరిస్థితి ఉంది. దీంతో గ్రామస్థులే చొరవ తీసుకొని ప్రసాదరావు తండ్రికి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విషయమై ఈనెల 10న ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురితమైంది. చికిత్స అనంతరం ప్రసాదరావు ఆరోగ్యంగా తిరిగి వస్తాడని గ్రామస్థులు ఆకాంక్షించారు. అయితే ఆయన కూడా చికిత్స పొందుతూ మృతిచెందారు. ఒకే కుంటుంబంలో ఇద్దరు మృతిచెందడంతో ఆ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. 

బొమ్మిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మారెళ్ల ప్రసాద్‌ వృత్తిరీత్యా పౌరోహిత్యం చేస్తున్నారు. అదేసమయంలో గ్రామంలోని విద్యార్థులకు రాత్రిళ్లు ట్యూషన్‌ చెప్తూ, పగలు కనిగిరిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో టీచరుగా పనిచేస్తున్నారు. వాటిపై వచ్చే ఆదాయంతోనే ఇద్దరు పిల్లలకు వివాహం చేశారు.  వృద్ధ తండ్రి, భార్యను పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా వారి కుటుంబాన్ని ఆర్థికంగా చిన్నాభిన్నం చేసింది. ప్రైవేటు స్కూళ్లు నడవకపోవడం, ట్యూషన్‌కు విద్యార్థులు రాకపోవడంతో పూట గడవడం కష్టమైంది. గ్రామంలోనే చిన్నచిన్న పనులకు వెళ్తూ సంసారాన్ని నెట్టుకొస్తున్నాడు. అంతలోనే అనారోగ్యానికి గురై మృతిచెందారు. ఆయన మృతికి బొమ్మిరెడ్డిపల్లి  సర్పంచ్‌ లోకిరెడ్డి అంకిరెడ్డి, గ్రామస్థులు సంతాపం తెలిపారు.


Updated Date - 2021-05-12T07:10:13+05:30 IST