ప్రత్యామ్నాయం మేమే
ABN , First Publish Date - 2020-08-12T09:31:26+05:30 IST
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీయే ప్రత్యామ్నాయమని బీజేపీ రాష్ట్ర శాఖ నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. 2024లో అధికారమే ఆలోచన, ధ్యేయం, లక్ష్యమని ప్రకటించారు.
2024లో అధికారమే లక్ష్యం: సోము వీర్రాజు ప్రకటన
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీయే ప్రత్యామ్నాయమని బీజేపీ రాష్ట్ర శాఖ నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. 2024లో అధికారమే ఆలోచన, ధ్యేయం, లక్ష్యమని ప్రకటించారు. కన్నా లక్ష్మీనారాయణ నుంచి బాధ్యతలు స్వీకరించిన ఆయన ఆవేశంగా ప్రసంగించారు. అనంతరం మీడియాతోనూ మాట్లాడారు. ‘2014కు ముందు అమరావతిలో భూములు ఎవరి పేరున ఉన్నాయి.. ఆ తర్వాత చేతులు మారినవి తదితర వివరాలతో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. అమరావతి అభివృద్ధిపై సీఎం జగన్ని కచ్ఛితంగా నిలదీస్తాం. మాకు అధికారం ఇస్తే అమరావతిని అభివృద్ధి చేసి చూపిస్తాం. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు వేసి లేఅవుట్లను అభివృద్ధి చేసి ఇవ్వాలి. నిజమైన రైతులకు తప్పనిసరిగా న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అలా చేయకుంటే రేపు అధికారంలోకి వచ్చే బీజేపీ-జనసేన ప్రభుత్వం చేస్తుంది’ అని వీర్రాజు వ్యాఖ్యానించారు.
ఒక్క అమరావతి మాత్రమే అభివృద్ధి కావాలని కొందరు అంటున్నారని.. 13 జిల్లాలూ ప్రగతి సాధించాలని బీజేపీ అంటోందని చెప్పారు. చంద్రబాబు, జగన్ తమకు శత్రువులు కాదని, బీజేపీని అధికారంలోకి తీసుకు రావడమే ధ్యేయమని స్పష్టం చేశారు. ‘గత టీడీపీ ప్రభుత్వంలో హోం మంత్రి కానిస్టేబుల్ను కూడా బదిలీ చేయించలేక పోయారు. ఇప్పుడు ఆ పదవి ఎస్సీలకు ఇచ్చామని చెబుతూ పోలీసులతోనే దళితులకు గుండు కొట్టిస్తున్నారు. హోంమంత్రి సుచరిత డీఎస్పీని కూడా బదిలీచేయలేని పరిస్థితి’ అని విమర్శించారు. కాగా.. బీజేపీ బలోపేతానికి తన వంతు కృషి చేశానని, అందరితో కలిసి నడవడంలో కొందరికి అన్యాయం జరిగి ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణ చెబుతున్నానని కన్నా అన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఇన్చార్జి సతీశ్జీ, సహ ఇన్చార్జి సునీల్ దేవధర్, పురంధేశ్వరి, సత్యకుమార్, ఎమ్మెల్సీ మాధవ్ పాల్గొన్నారు.