సీఎం జగన్‌ దగ్గర ఒక ముఠా చేరింది: సోమువీర్రాజు

ABN , First Publish Date - 2022-01-25T17:35:27+05:30 IST

సీఎం జగన్‌ దగ్గర ఒక ముఠా చేరిందని, ఆ ముఠానే సీఎంకు తప్పుడు సమాచారం ఇస్తోందని..

సీఎం జగన్‌ దగ్గర ఒక ముఠా చేరింది: సోమువీర్రాజు

విజయవాడ: ముఖ్యమంత్రి జగన్‌ దగ్గర ఒక ముఠా చేరిందని, ఆ ముఠానే సీఎంకు తప్పుడు సమాచారం ఇస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు విమర్శించారు. మంగళవారం ఉద్యోగులు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావం తెలుపుతూ బీజేపీ పార్టీ కార్యాలయంలో సోమువీర్రాజు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ అధికారులు కూడా సీఎంను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్యేలు మట్టి, ఇసుక అమ్ముకుంటున్నారని, ఎమ్మెల్యేల బంధువులూ ఇందులో భాగస్వాములేనన్నారు. రాష్ట్ర ఆదాయం పెంచి అందరికీ మేలు చేయాలని, ఈ విధంగా చేయడం సరికాదన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రూ. 50 వేల కోట్ల ఆదాయం తెస్తామన్నారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రోడ్ల మీద తిరిగారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్యాలెస్‌లో కూర్చుని జనాన్ని రోడ్లెక్కిస్తున్నారని సోమువీర్రాజు మండిపడ్డారు.


ఉద్యోగులను ఇంతలా ఇబ్బంది పెడుతున్న ఏకైక ప్రభుత్వం జగన్‌దేనని సోము వీర్రాజు అన్నారు. రాష్ట్రం ఆదాయం కోల్పోవడంతో జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. ఇసుకను తక్కువ ధరకు అమ్మినా రూ. 5 వేల కోట్లు వస్తాయన్నారు. ఎర్రచందనాన్ని ఇష్టానుసారంగా అమ్ముతున్నారని విమర్శించారు. ఆదాయ వనరులన్నీ అధికారపార్టీకి... అప్పులన్నీ ప్రజలకు ఇస్తున్నారని, తాము అధికారంలోకి వస్తే ఎర్రచందనంను ఆదాయ వనరుగా మారుస్తామని సోమువీర్రాజు అన్నారు.

Updated Date - 2022-01-25T17:35:27+05:30 IST