Somu Veerraju: రాష్ట్రాభివృద్ధికి కేంద్రం చొరవ చూపిస్తున్నా.. జగన్ తగిన చర్యలు తీసుకోవడంలేదు..

ABN , First Publish Date - 2022-09-01T17:35:33+05:30 IST

కేంద్రం ఇస్తున్న హార్డు వేర్ పార్క్, పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌ లను ఎందుకు తీసుకోవడం లేదో సీఎం సమాధానం చెప్పాలి.

Somu Veerraju: రాష్ట్రాభివృద్ధికి కేంద్రం చొరవ చూపిస్తున్నా.. జగన్ తగిన చర్యలు తీసుకోవడంలేదు..

అమరావతి (Amaravathi): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి (AP) కేంద్ర ప్రభుత్వం (Central Govt.)  ఇస్తున్న హార్డు వేర్ పార్క్ (Hardware Park), పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌ (Petro chemical Complex)లను ఎందుకు తీసుకోవడం లేదు?.. దీనిపై సీఎం జగన్ (CM Jagan) సమాధానం చెప్పాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju) డిమాండ్ చేశారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం  ఇచ్చిన పరిశ్రమలు, కారిడార్‌లకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించి, వాటిని అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు విఫలమైందని ప్రశ్నించారు. బల్క్ డ్రగ్ పార్క్ విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి చొరవ చూపిస్తోందని, రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం మాత్రం  కేంద్రం కేటాయించిన సంస్థలను ఏర్పాటు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. వాటి కోసం కేటాయించిన భూములను ఇతర అవసరాలకు వినియోగిస్తోందో, లేదో  జవాబు చెప్పాలన్నారు. విభజన బిల్లులో లేనప్పటికీ హార్డు వేర్ పార్క్‌తో పాటు, రెండు యూనివర్సిటీల ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 2014లోనే పార్లమెంటు సాక్షిగా నిర్మలా సీతారామన్ ప్రస్తావించారన్నారు. నాటి టీడీపీ, నేటి వైసీపీ  ప్రభుత్వాలు రెండు కూడా విస్మరించాయని విమర్శించారు. కేంద్రం ప్రకృతి చికిత్సాలయానికి  కేటాయించిన భూములను జగన్ ఇండ్ల స్థలాలకు కేటాయించారన్నారు. నిధులను దారి మళ్ళించడం ద్వారా ఈ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తోందని, రాష్ట్రాభివృద్ధిపై ఎందుకు  దృష్టి పెట్టడం లేదో సీఎం జగన్ చెప్పాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.

Updated Date - 2022-09-01T17:35:33+05:30 IST