Somu Veerraju: అసెంబ్లీలో సీఎం అన్ని అబద్దాలే చెబుతున్నారు..
ABN , First Publish Date - 2022-09-19T18:46:10+05:30 IST
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి బీజేపీ (BJP) స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు నిర్వహించనుంది.
విజయవాడ (Vijayawada): ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి బీజేపీ (BJP) స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు నిర్వహించనుంది. అభివృద్ధి నిరోధక విధానాలకు వ్యతిరేకంగా ప్రజాపోరు పేరుతో సభలు, జగన్ (Jagan) ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రజలకు బీజేపీ నేతలు వివరించనున్నారు. సోమవారం విజయవాడ సత్యనారాయణ పురంలో ప్రజా పోరు యాత్ర సభను రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju) ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఒక్కో జిల్లాలో 50 పోరు యాత్ర సభలు నిర్వహిస్తామన్నారు. జగన్ పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. జగన్ సీఎం అయ్యాక ప్రజల్లోకి రావడమే మానేశారన్నారు. అసెంబ్లీలో కూడా అన్ని అబద్దాలే చెబుతున్నారని, టీడీపీ పాలనలో ఇసుక తక్కువ ధరకే వచ్చిందని, ఇప్పుడు దొరకడమే లేదన్నారు. జగన్కు సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్నా... ధర పెంచేశారని ఆరోపించారు. సొమ్ము కేంద్రానిది అయితే... సోకు జగన్ది అన్నట్లుగా ఉందన్నారు. సీఎం జగన్ రాజధానిని ఎడారిగా మార్చేశారని సోము వీర్రాజు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.