2024 నాటికి బలమైన శక్తిగా..: సోము వీర్రాజు
ABN , First Publish Date - 2020-08-08T02:30:04+05:30 IST
ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా బలపడేందుకు అన్ని అవకాశాలు ఉన్న రాష్ట్రం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. అన్ని వనరులూ, సుధీర్ఘ తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం అని పేర్కొన్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా బలపడేందుకు అన్ని అవకాశాలు ఉన్న రాష్ట్రం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. అన్ని వనరులూ, సుధీర్ఘ తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం అని పేర్కొన్నారు. ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో జనసేన, బీజేపీ ఉన్నాయని వీర్రాజు చెప్పుకొచ్చారు. శుక్రవారం నాడు జనసేన అధినేత పవన్ను సోము వీర్రాజు కలిశారు. వీరి భేటీ అనంతరం సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధి కోసం అన్ని అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తామన్నారు. వాటికి కేంద్ర ఆలోచనలను మిళితం చేసి, కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలను పవన్ నాయకత్వంలో ప్రజల ముందుకు తీసుకువెళ్తామని చెప్పారు. 2024 నాటికి రాష్ట్రంలో బలమైన శక్తిగా రూపుదిద్దేందుకు ఒక ప్రణాళిక రచిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. అమరావతి విషయంలో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసినప్పటికీ.. రైతాంగానికి సంబంధించిన అంశాల్లో క్షుణ్ణంగా అధ్యయనం చేసి వారికి ఏ విధమైన సాయం చేయగల అవకాశం ఉందో ఆలోచన చేస్తామని వీర్రాజు తెలిపారు. రైతులకు ఎలాంటి నష్టం లేని ఆలోచనను తెలియజేసే ప్రయత్నం చేస్తామన్నారు.