నాన్న నిర్మిస్తే.. కొడుకు అమ్మేస్తున్నాడు: సోమిరెడ్డి
ABN , First Publish Date - 2022-04-07T01:25:54+05:30 IST
అత్యంత సాంకేతిక ప్రమాణాలతో నిర్మించిన శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ప్రైవేటుపరం చేయాలని
ముత్తుకూరు: అత్యంత సాంకేతిక ప్రమాణాలతో నిర్మించిన శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ప్రైవేటుపరం చేయాలని చూస్తే ఊరుకోమని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి హెచ్చరించారు. నేలటూరులోని జెన్కో థర్మల్ కేంద్రం వద్ద ఉద్యమం చేస్తున్న ఉద్యోగులు, కార్మికులకు మద్దతుగా సోమిరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఉద్యోగులు, కార్మికులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ తండ్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో ఈ థర్మల్ కేంద్రం నిర్మిస్తే.. కొడుకు జగన్ అమ్మడానికి ప్రయత్నిస్తున్నాడని దుయ్యబట్టారు. ఎంతో సామర్థ్యం ఉన్న జెన్కో థర్మల్కేంద్రం నష్టాలకు, జెన్కో ఇంజనీరు నుంచి డైరెక్టరుగా ఎదిగిన ఓ వ్యక్తి కారణమని ఆరోపించారు. రెండు యూనిట్లతో 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాల్సిన థర్మల్ కేంద్ర 600 మెగావాట్ల ఉత్పత్తికి పడిపోవడానికి కారణాలేమిటో విచారణ జరపాలని సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి డిమాండ్ చేశారు.