రాష్ట్రంలో మద్యం తయారు చేస్తున్న కంపెనీలన్నీ వైసీపీ నేతలవే..: సోమిరెడ్డి

ABN , First Publish Date - 2022-03-18T18:33:23+05:30 IST

ఊరూపేరూ లేని కల్తీ మద్యం, సారా విక్రయిస్తూ.. పేదల ప్రాణాలు తీస్తున్నారని టీడీపీ నేత సోమిరెడ్డి అన్నారు.

రాష్ట్రంలో మద్యం తయారు చేస్తున్న కంపెనీలన్నీ వైసీపీ నేతలవే..: సోమిరెడ్డి

నెల్లూరు: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధనదాహంతో ఊరూ పేరూలేని మద్యం, కల్తీసారా విక్రయిస్తూ ప్రజల ప్రాణాలు హరిస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ నాసిరకం మద్యంతో ఏటా రూ.5 వేల కోట్లు దండుకుంటున్నారని ఆరోపించారు. ఏపీలో మద్యం తయారీ సంస్థలన్నీ మంత్రులు, వైసీపీ నేతలవేనని, మంత్రి బొత్స, ఎంపీ మిథున్‌రెడ్డికి చెందిన డిస్టిలరీ కంపెనీలతో పాటు.. నెల్లూరు ఎస్ఎన్‌జే కంపెనీ మద్యంలో హానికర రసాయనాల మిళితమేనని తేలిపోయిందన్నారు. కల్తీ మద్యం తాగేవారి మెదడు, నాడీ, జీర్ణ వ్యవస్థ దెబ్బతిని.. ప్రాణాలు పోతున్నాయని ల్యాబ్‌ నివేదికలో తేలిందన్నారు. జంగారెడ్డిగూడెంలో 28 మంది చనిపోకముందే ప్రభుత్వం నాటు సారా నిల్వలను ధ్వంసం చేసి ఉండాల్సిందని సోమిరెడ్డి అన్నారు.

Updated Date - 2022-03-18T18:33:23+05:30 IST