ఓఎల్‌ఎక్స్‌లో అమ్మకానికి పటేల్ విగ్రహం.. అవాక్కైన నెటిజన్లు

ABN , First Publish Date - 2020-04-05T21:41:55+05:30 IST

గుజరాత్‌లోని నర్మదా నది తీరానలోని సాధుబెట్ అనే దీవిలో కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భారత తొలి హోం మంత్రి సర్ధార్ వల్లభాయ్

ఓఎల్‌ఎక్స్‌లో అమ్మకానికి పటేల్ విగ్రహం.. అవాక్కైన నెటిజన్లు

గాంధీనగర్: గుజరాత్‌లోని నర్మదా నది తీరానలోని సాధుబెట్ అనే దీవిలో కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భారత తొలి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని సెకండ్ హ్యాండ్ వస్తువులను అమ్మే ఓఎల్‌ఎక్స్‌లో ఎవరో అమ్మకానికి పెట్టారు. కేంద్రం దాదాపు 3వేల కోట్లు వెచ్చించి నిర్మించిన ఈ 182 మీటర్ల విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా గుర్తింపుపొందింది. దీన్ని ఇప్పటివరకూ సందర్శించిన పర్యాటకుల ద్వారా రూ.82 కోట్ల ఆదాయం కూడా వచ్చింది. 


అయితే ఇప్పుడు కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తి చెందుతుండటంతో.. దాన్ని అరికట్టేందుకు వినియోగించే వైద్య పరికరాల్లో కొరత ఏర్పడింది. దీన్ని పరిష్కరించేందుకు ఓవైపు ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇందుకోసం విరాళాలు కూడా సేకరిస్తుంది. మరోవైపు ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రం సంధిస్తూ.. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి కరోనా వ్యాధిగ్రస్తులకు వైద్యం, వైద్య పరికరాల కోసం ఐక్యతా విగ్రహాన్ని విక్రయిస్తున్నామని పేర్కొన్నాడు. ‘‘అత్యవసర పరిస్థితుల్లో ఐక్యతా విగ్రహాన్ని అమ్మేస్తున్నాము. ఈ డబ్బులతో వైద్య సేవలు మెరుగుపరచడం, వైద్య పరికరాలను కొనుగోలు చేయాలి’’ అంటూ అతను ఓఎల్‌ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. దీని ధరను ఏకంగా రూ.30 వేల కోట్లుగా అతను పేర్కొన్నాడు. 


ఇది చూసిన నెటిజన్లు ఒక్కసారిగా అవాక్కయ్యారు. దీన్ని ఫేక్‌పోస్ట్‌గా గుర్తించిన ఓఎల్‌ఎక్స్ కూడా వెంటనే తమ పోర్టల్‌ నుంచి తొలగించింది. కానీ, అప్పటికే కొందరు స్క్రీన్‌షాట్లు తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.

Updated Date - 2020-04-05T21:41:55+05:30 IST