రేపటి నుంచి మరికొన్ని ఓపెన్
ABN , First Publish Date - 2020-06-07T07:51:48+05:30 IST
జిల్లాలో మరి కొన్నింకి లాక్డౌన్ సడలింపులు అమల్లోకి రానున్నాయి.
హోటళ్లు, రెస్టారెంట్లకు అవకాశం
ఆలయాలు, షాపింగ్ మాల్స్కూ అనుమతి
కొవిడ్ నిబంధనల అమలు తప్పనిసరి
ప్రభుత్వ ఉత్తర్వులతో నిర్వాహకుల ఏర్పాట్లు
సినిమా హాళ్లు, కంటైన్మెంట్ పరిధిలోని
దుకాణాలు, ఇతరత్రా వాటికి నోఛాన్స్ ఒంగోలు, జూన్ 6 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో మరి కొన్నింకి లాక్డౌన్ సడలింపులు అమల్లోకి రానున్నాయి. దేవాలయాలు, మసీదులు, చర్చిలు, షాపింగ్ మాల్స్, హోటళ్లు, రెస్టారెంట్లు సోమవారం నుంచి తెరుచుకోనున్నాయి. అయితే కంటైన్మెంట్ జోన్ల పరిధి లోని ఉన్న వాటిని మాత్రం తెరిచేందుకు అవకాశం లేదు. కరోనా కట్టడి కోసం రెండున్నర మాసాలుగా లాక్డౌన్ను అమలు చేస్తున్న ప్రభుత్వాలు దశలవారీగా పలు రంగాలకు వెసులుబాట్లు కల్పిస్తూ వస్తున్నాయి. ఈనెల 1 నుంచి ఐదో విడత లాక్డౌన్ అమలులోకి రాగా ఆరోజు నుంచి గతం కన్నా ఎక్కువ సడలింపులు ఇచ్చారు. సోమవారం నుంచి మరిన్ని వెసులు బాట్లు కల్పించారు. అయితే కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
దీంతో ఆయా సంస్ధల్లో భౌతికదూరం పాటింపునకు వీలుగా మార్కింగ్, శానిటైజ్, థర్మల్ స్ర్కీనింగ్ వంటివి ఏర్పా టు చేస్తున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లలో అయితే వీలున్నంత వరకూ పార్శిళ్లు ఇచ్చేలా చూడాలని, తప్పనిసరైతేనే ఆహారం అక్కడే తినేందుకు అనుమతిం చాలని ప్రభుత్వం సూచించింది.
అలాంటపుడు విధిగా రెండు మీటర్లు దూరం పాటించేలా టేబుళ్లు ఏర్పాటు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో ఆయా రంగాల నిర్వాహకులు శనివారం నుంచే ఏర్పాట్లలో నిమగ్న మయ్యారు. వివిధ ప్రార్థనా మందిరాలు, ఆలయాల వద్ద కూడా సోమవారం నుంచి కార్యకలాపాలు చేపట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే సినిమా హాళ్లను తెరిచేందుకు మాత్రం ప్రభుత్వం అనుమతించ లేదు.