పరిధి దాటిన తీర్పులు కొన్ని కనిపిస్తున్నాయి : వెంకయ్య నాయుడు

ABN , First Publish Date - 2020-11-25T21:40:15+05:30 IST

మన దేశంలో రాజ్యాంగమే సర్వోన్నతమైనదని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

పరిధి దాటిన తీర్పులు కొన్ని కనిపిస్తున్నాయి : వెంకయ్య నాయుడు

న్యూఢిల్లీ : మన దేశంలో రాజ్యాంగమే సర్వోన్నతమైనదని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల్లో ఏదీ ఒకదానిపై మరొకటి ఉన్నతమైనదిగా చెప్పుకోకూడదని తెలిపారు. అయితే న్యాయ వ్యవస్థ తన పరిధి దాటిందనే ప్రత్యేకమైన అభిప్రాయాన్ని కొన్ని కోర్టు తీర్పులు కలిగిస్తున్నాయన్నారు. రాజ్యాంగం నిర్వచించిన పరిధులలోనే ఈ మూడు వ్యవస్థలు పని చేయాలన్నారు. 


గుజరాత్‌లోని కేవడియాలో జరిగిన 80వ ఆలిండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్‌ను ఉద్దేశించి వెంకయ్య నాయుడు బుధవారం మాట్లాడారు. ‘‘శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల మధ్య సామరస్యపూర్వక సమన్వయం - శక్తిమంతమైన ప్రజాస్వామ్యానికి కీలకం’’ అనే అంశంపై ఈ సదస్సు జరిగింది. ప్రతి విభాగం ఇతర విభాగాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా పని చేసుకోవడంలోనే సామరస్యం ఉంటుందని వెంకయ్య నాయుడు చెప్పారు. దీనివల్ల పరస్పర గౌరవం, బాధ్యత, సంయమన భావం ఏర్పడుతుందన్నారు. దురదృష్టవశాత్తూ హద్దులు దాటిన సందర్భాలు కొన్ని కనిపిస్తున్నట్లు తెలిపారు. పరిథి దాటినట్లు స్పష్టమైన అభిప్రాయాన్ని కలిగించే కొన్ని తీర్పులు ఉన్నాయన్నారు. 


సూపర్ ఎగ్జిక్యూటివ్‌గా, సూపర్ లెజిస్లేచర్‌గా న్యాయ వ్యవస్థ వ్యవహరిస్తోందనే భావన కలిగే విధంగా వ్యవహరించడం వాంఛనీయం కాదన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి సుప్రీంకోర్టు, హైకోర్టులు సంస్కరణాత్మక జోక్యాలతోపాటు సాంఘిక-ఆర్థిక లక్ష్యాలను ప్రోత్సహించేందుకు కొన్ని పరిథి దాటిన తీర్పులు ఇచ్చాయన్నారు.  అయితే అప్పుడప్పుడు కోర్టులు తమ పరిథి దాటి శాసన, కార్యనిర్వాహక విభాగాల పరిథిలో ప్రవేశిస్తున్నాయా? అనే ఆందోళనలు రేకెత్తుతున్నాయన్నారు. కొన్ని అంశాలను ప్రభుత్వంలోని ఇతర విభాగాలకు వదిలిపెట్టి ఉండవలసిందనే విషయంపై చర్చలు జరుగుతున్నాయన్నారు. 


పరిథి దాటి ఇచ్చిన తీర్పులకు ఉదాహరణగా, దీపావళి బాణసంచా కాల్చడంపై ఇచ్చిన తీర్పును, న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో కార్యనిర్వాహక శాఖ పాత్రను నిరాకరిస్తూ ఇచ్చిన తీర్పును, జాతీయ న్యాయ నియామకాల కమిషన్ చట్టాన్ని రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పును వెంకయ్య నాయుడు ప్రస్తావించారు. 


కొన్ని సందర్భాల్లో శాసన వ్యవస్థ కూడా తన పరిథిని దాటే ప్రయత్నం చేసిందన్నారు. ఇందుకు ఉదాహరణగా 39వ రాజ్యాంగ సవరణను పేర్కొన్నారు. 1975లో ఏర్పడిన పరిస్థితుల్లో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాన మంత్రి పదవులకు ఎన్నికలను జ్యుడిషియల్ స్క్రూటినీ పరిథికి అతీతంగా ఉండే విధంగా చేశారన్నారు. 



Updated Date - 2020-11-25T21:40:15+05:30 IST