వీళ్లు ఓకే..మిగిలినవాళ్లో?

ABN , First Publish Date - 2022-06-26T06:59:07+05:30 IST

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ డిక్లేర్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ పడింది. అర్హత సాధించిన ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

వీళ్లు ఓకే..మిగిలినవాళ్లో?

సచివాలయ ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ

970 మందికి తప్పని ఎదురుచూపులు


చిత్తూరు(ఆంధ్రజ్యోతి): గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ డిక్లేర్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ పడింది. అర్హత సాధించిన ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 1వ తేదీ నుంచి చిత్తూరు కొత్త జిల్లాలోని 3,532 మంది సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. ఆగస్టు 1న జూలై నెలకు సంబంధించిన పేస్కేల్‌ జీతం వీరి ఖాతాల్లో పడుతుంది. చిత్తూరు కొత్త జిల్లాలో 4,502 మంది సచివాలయ ఉద్యోగులు పని చేస్తుండగా, పలు నిబంధనల పేరుతో 970 మందిని రెగ్యులర్‌ చేయకుండా పక్కన పెట్టేశారు. దీంతో వారంతా ఆందోళలో ఉన్నారు. 


అయినా రూ.2 లక్షలు నష్టం

2019 అక్టోబరు 2వ తేదీన సచివాలయ వ్యవస్థ ప్రారంభమైనప్పటి నుంచి రూ.15 వేల స్టైఫండ్‌కు ఉద్యోగులు పనిచేస్తున్నారు. నోటిఫికేషన్‌లో చెప్పినట్లు రెండేళ్లకు అంటే 2021 అక్టోబరు నుంచి వారిని రెగ్యులర్‌ చేసి, పే స్కేల్‌ అమలు చేయాల్సి ఉండగా ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో సచివాలయ ఉద్యోగులు ఆందోళనలు చేశారు. ఇప్పుడు తొమ్మిది నెలలు ఆలస్యంగా రెగ్యులర్‌ చేస్తుండడం, పీఎ్‌ఫను ప్రభుత్వం జమ చేయకపోవడంతో ఈ కాలంలో ప్రతి సచివాలయ ఉద్యోగీ రూ.2 లక్షల మేర నష్టపోయారు.


259 మందికి రూ.23,120, 3,273 మందికి  రూ.22,460 బేసిక్‌ పే

సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు వేర్వేరు పే స్కేల్స్‌ను నిర్ణయించారు.జిల్లాలో204 మంది గ్రేడ్‌-5 కార్యదర్శులు, 55 మంది అడ్మిన్‌ సెక్రటరీలు పనిచేస్తున్నారు.వీరికి 23,120 చొప్పున బేసిక్‌ పే నిర్ణయించారు. మిగిలిన 18 రకాల ఉద్యోగులు 3,273 మందికి రూ.22,460 నిర్ణయించారు. పంచాయతీ కార్యదర్శి, అడ్మిన్‌ సెక్రటరీల బేసిక్‌ మిగిలిన వారి కంటే రూ.660 ఎక్కువగా చూపారు. ఇది గ్రాస్‌ జీతంలో రూ.వెయ్యి తేడా ఉంటుంది. అలాగే ఉద్యోగులందరికీ రూ.30 వేలు గ్రాస్‌ జీతం రానుంది.


Updated Date - 2022-06-26T06:59:07+05:30 IST