‘సోమశిల’ రక్షణపై నిర్లక్ష్యం
ABN , First Publish Date - 2022-09-28T02:57:02+05:30 IST
సోమశిల జలాశయం రక్షణ పనులపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. అత్యవసరంగా చేయాల్సిన పనుల్లో కూడా జాప్యం
వరదలకు పవర్ టన్నల్ రివెట్మెంట్ల ధ్వంసం
ప్రమాదకరంగా దిగువ కట్టడాలు
ఏడాది కావస్తున్నా ఊసేలేని మరమ్మతులు
అనంతసాగరం, సెప్టెంబరు 27: సోమశిల జలాశయం రక్షణ పనులపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. అత్యవసరంగా చేయాల్సిన పనుల్లో కూడా జాప్యం చేస్తున్నారు. దీంతో భవిషత్తులో వచ్చే వరదలతో కట్టడాలకు మరింత ప్రమాదం పొంచి ఉంది. జలాశయం దిగువ కట్టడాలు 2020-21లో వచ్చిన వరదలతో పూర్తిగా దెబ్బతిన్నాయి. వాటి పునర్నిర్మాణం చేపడితే రాబోవు విపత్తుల నుంచి కాపాడుకోవచ్చు. కానీ ఆదిశగా పనులు చేయడంలో అధికార యంత్రాంగం చొరవ చూపలేదు. కాబట్టి రానున్న వరదలతో దిగువ ప్రాంతాలకు ముప్పు వాటిల్లవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జలాశయం నుంచి నీరు దిగువ (డెల్టా)కు వదిలే సమయంలో ప్రాధాన్యతను బట్టి పవర్ టన్నల్ నుంచి తొలుత నీటి సరఫరా జరుగుతుంది. అత్యవసరమైతే తప్ప క్రస్ట్గేట్లు ఎత్తరు. పవర్ టన్నల్ సామర్ధ్యం 2500 క్యూసెక్కులు కాగా, పవర్ ప్లాంట్ నుంచి కాలువ 500 మీటర్ల మేరకు రెండువైపులా పొర్లుకట్టలు నిర్మించి రివెట్మెంట్లతో పటిష్ట పరిచి ప్లాంట్ నుంచి నదిలోకి నీరు తరలించేలా కాలువను అనుసంధానం చేశారు. అయితే గత నవంబరులో ఎగువ నుంచి సోమశిలకు 5.60 లక్షల క్యూసెక్కుల వరద రాగా, దిగువకు 12 గేట్లు ఎత్తి 6.5 లక్ష్యల క్యూసెక్కుల నీటిని సరఫరా చేశారు. ఈక్రమంలో కట్టడాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పవర్ ప్లాంట్ కాలువ రూపురేఖలు కోల్పోయింది. కాలువ పొర్లకట్టలు నేలమట్టం అయ్యాయి. ఆ పనులపై ఇంతవరకు ఎలాంటి ప్రతిపాద నలు పంపలేదు. భవిషత్తులో అతి భారీ వరద వస్తే దిగువన రక్షణ కట్డడాలు లేని కారణంగా సోమశిల గ్రామానికి ప్రమాదం ముంచుకొచ్చే వీలుంది. ఈ నేపథ్యంలో దిగువ ఆఫ్రాన్ పరిధిలోని పొరుకట్టల నిర్మాణాలపై అధికారులు దృష్టి సారించాల్సి ఉంది.
----------