కార్గిల్ అమరులకు జాతి ఘన నివాళి
ABN , First Publish Date - 2021-07-27T07:02:23+05:30 IST
కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు యావత్ దేశం సోమవారం
శ్రీనగర్, ఢిల్లీ, జూలై 26: కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు యావత్ దేశం సోమవారం ఘనంగా నివాళులర్పించింది. దేశ రక్షణలో సైనికుల అసమాన పోరాటాన్ని కొనియాడింది. 1999 జూలై 26న కార్గిల్లో పాకిస్థాన్ దురాక్రమణను తిప్పికొట్టిన నేపథ్యంలో ఏటా ఈ రోజును ‘విజయ్ దివ్స’గా జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా సోమవారం
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో ఉన్న దాగర్ యుద్ధ స్మారకాన్ని సందర్శించారు. గుల్మార్గ్ను కోవింద్, జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సందర్శించి సైనిక దళాలతో సంభాషించారు. అమరులు, వారి కుటుంబాలకు దేశం ఎప్పటికీ రుణ పడి ఉంటుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు. అమరుల ధైర్య సాహసాలు మనకు రోజూ ప్రేరణ కలిగిస్తాయని ప్రధాని మోదీ అన్నారు. సైనికుల తెగువకు దేశం శిరస్సు వంచి నమస్కరిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కొనియాడారు. కాగా, కార్గిల్ అమరులకు రాజ్యసభ నివాళి అర్పించింది. లద్దాఖ్లోని ద్రాస్ యుద్ధ స్మారకం వద్ద కార్గిల్ అమరులకు సైన్యం ఘనంగా నివాళులర్పించింది.