గణనాథుడికి ఘనమైన రుచులు
ABN , First Publish Date - 2020-08-22T05:44:26+05:30 IST
వినాయకచవితి అనగానే ఉండ్రాళ్లు గుర్తొస్తాయి. అలాగే వివిధ రాష్ట్రాల్లో రకరకాల నైవేద్యాలు సమర్పిస్తారు.
వినాయకచవితి అనగానే ఉండ్రాళ్లు గుర్తొస్తాయి. అలాగే వివిధ రాష్ట్రాల్లో రకరకాల నైవేద్యాలు సమర్పిస్తారు. గొల్పాపిడీ, ఎల్లు కోజుకట్టాయి, ఉండ్రాళ్ల పాయసం... ఇలా నైవేద్యం ఏదైనా ఆ లంబోదరుడికి భక్తితో సమర్పిస్తారు. ఆ నైవేద్యాలను మీరూ ట్రై చేయండి.
1 .గొల్పాపిడీ (సుక్ధీ)
గుజరాతీయులు వినాయకుడికి నైవేద్యంగా సమర్పించే స్వీట్ ఇది.
కావలసినవి.
గోధుమ పిండి - ఒక కప్పు, గసగసాలు - ఒక టీస్పూన్, నెయ్యి - ఐదు టేబుల్స్పూన్లు, బెల్లం - అరకప్పు, యాలకుల పొడి - పావు టీస్పూన్, ఎండు కొబ్బరి తురుము - ఒక టీస్పూన్.
తయారీ
- మందంగా ఉన్న పాన్కు నెయ్యి రాసి గసగసాలు చల్లుకుని పక్కన పెట్టుకోవాలి.
- స్టవ్పై పాత్రను పెట్టి నెయ్యి వేయాలి. నెయ్యి కరిగిన తరువాత గోధుమ పిండి వేసి చిన్నమంటపై వేగించాలి.
- గోధుమ రంగులోకి మారాక స్టవ్పై నుంచి దింపుకొని బెల్లం, యాలకుల పొడి, కొబ్బరి తురుము కలుపుకోవాలి.
- బెల్లం కరిగాక నెయ్యి రాసి పెట్టిన పాన్లో మిశ్రమాన్ని పోయాలి. పాన్ అంతటా సమంగా పరుచుకునేలా చూసుకోవాలి.
- వేడి తగ్గకముందే డైమండ్ షేపులో ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- ఒకవేళ బెల్లం వేశాక మిశ్రమం బాగా గట్టిగా అయితే కొద్దిగా పాలు కలుపుకోవచ్చు.
2. ఎల్లు కోజుకట్టాయి
తమిళనాడులో ఏకదంతునికి భక్తితో ఈ నైవేద్యం సమర్పిస్తారు.
కావలసినవి.
నువ్వులు - ఒక కప్పు, బెల్లం - ఒక కప్పు, యాలకుల పొడి - పావు టీస్పూన్, బియ్యం పిండి - ఒక కప్పు, నెయ్యి - అర టీస్పూన్, ఉప్పు - తగినంత.
తయారీ
- ముందుగా నువ్వులను వేగించి పొడి చేసుకోవాలి. తరువాత బెల్లం, యాలకుల పొడి వేసి చిన్న చిన్న లడ్డూలు చేసుకుంటూ పక్కన పెట్టుకోవాలి.
- స్టవ్పై ఒక పాత్ర పెట్టి నీళ్లు పోసి మరిగించాలి. నీళ్లు మరుగుతున్న సమయంలో స్టవ్ ఆర్పేసి దింపుకోవాలి.
- బియ్యం పిండి వేసి కలుపుకోవాలి. మెత్తటి ఉండలా చేసుకోవాలి.
- తరువాత కొద్ది కొద్దిగా చేతుల్లోకి తీసుకుంటూ చిన్న పూరీలా చేసుకోవాలి.
- ఇప్పుడు మధ్యలో నువ్వుల లడ్డూ పెట్టి చుట్టూ కొనలు దగ్గరకు చేర్చి మోదక్లా చేసుకోవాలి.
- తరువాత కుక్కర్లో పెట్టి పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
3. ఉండ్రాళ్ల పాయసం
ఇది తెలుగు ప్రజలు లంబోదరునికి ఆరగింపు చేసే స్వీటు.
కావలసినవి.
బియ్యం పిండి - ఒక కప్పు, ఉప్పు - తగినంత, నెయ్యి - ఒక టేబుల్స్పూన్, జీడిపప్పు - నాలుగైదు పలుకులు, బాదం - నాలుగైదు పలుకులు, ఎండు కొబ్బరి - కొద్దిగా, పంచదార - అర కప్పు, యాలకుల పొడి - అర టీస్పూన్, ఎండుకొబ్బరి తురుము - ఒక టేబుల్స్పూన్,
తయారీ
- ముందుగా స్టవ్పై ఒక పాన్ పెట్టి ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి మరిగించాలి. నీళ్లు మరుగుతున్న సమయంలోనే రుచి కోసం చిటికెడు ఉప్పువేయాలి.
- తరువాత బియ్యం పిండి వేయాలి. చిన్న మంటపై ఉంచి బాగా కలుపుకోవాలి.
- స్టవ్ పైనుంచి దింపుకొని చల్లారిన తరువాత పిండిని ఒక ఉండలా చేసుకోవాలి.
- తరువాత కొద్దికొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న బాల్స్ తయారుచేసుకుని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టవ్పై ఒక పాత్ర పెట్టి నెయ్యి వేయాలి. అందులో బాదం, జీడిపప్పు, ఎండుకొబ్బరి వేసి వేగించుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టాలి.
- అదే గిన్నెలో అర లీటరు నీళ్లు పోసి చిటికెడు ఉప్పు వేయాలి. నీళ్లు మరుగుతున్న సమయంలో తయారుచేసి పెట్టుకున్న బాల్స్ వేయాలి.
- కాసేపయ్యాక రెండు టేబుల్స్పూన్ల బియ్యం రవ్వ వేయాలి. పాయసం చిక్కదనం కోసం ఈ రవ్వ ఉపయోగపడుతుంది.
- చిన్నమంటపై పెట్టి కాసేపు ఉడికించాలి. తరువాత పంచదార వేసి కలుపుకోవాలి.
- పంచదార పూర్తిగా కరిగాక యాలకుల పొడి వేయాలి. ఎండుకొబ్బరి తురుము వేసి కలియబెట్టుకోవాలి.
- ఐదు నిమిషాలు ఉడికిన తరువాత స్టవ్ పైనుంచి దింపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి.