దొనకొండ భూములపై కన్ను

ABN , First Publish Date - 2020-09-23T10:09:19+05:30 IST

గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఏపీజీఈసీఎల్‌)కు ప్రకాశం జిల్లా దొనకొండలోని పారిశ్రామిక హబ్‌ భూములను భారీగా కట్టబెట్టే చర్యలు మొదలయ్యాయి. అక్కడ పారిశ్రామిక మౌలిక

దొనకొండ భూములపై కన్ను

సోలార్‌ ప్రాజెక్టు కోసం గ్రీన్‌ ఎనర్జీకి! 

1,454 ఎకరాలు కేటాయించాలని ప్రకాశం కలెక్టర్‌కు ఆదేశం


అమరావతి, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఏపీజీఈసీఎల్‌)కు ప్రకాశం జిల్లా దొనకొండలోని పారిశ్రామిక హబ్‌ భూములను భారీగా కట్టబెట్టే చర్యలు మొదలయ్యాయి. అక్కడ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కోసం కేటాయించిన భూమిలో భారీ సోలార్‌ ప్రాజెక్టు ఏర్పాటుకు 1,454.06 ఎకరాలను ముందస్తుగా ఆ సంస్థకు అప్పగించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశిస్తూ రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి వి.ఉషారాణి జీవో 600ని జారీ చేశారు. భూ కేటాయింపుల ఉత్తర్వు ఇంకోసారి ఇవ్వనున్నారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు భూములు దొరకడం లేదు. వందలు, వేల ఎకరాలు అవసరమయ్యే సోలార్‌  ప్రాజెక్టులకు మరింత గడ్డుకాలం. దీంతో అసైన్డ్‌ భూములను కూడా ఈ అవసరాలకు వాడుకునేందుకు వీలుగా ఏపీ అసైన్‌మెంట్‌ చట్టం-1977ను సవరించారు. దొనకొండ పరిధిలో భారీ సోలార్‌ ప్రాజెక్టుకు సర్కారు సిద్ధమైంది.


ఇందుకోసం భూమి అన్వేషణ ప్రారంభించగా.. ఏపీఐఐసీ వద్ద ఉన్న 2,395 ఎకరాలపై దృష్టిపడింది. ఈ భూమిని 2018లో మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌ ఏర్పాటుకు నాటి ప్రభుత్వం భారీ పారిశ్రామిక  అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన పేరిట అప్పటి ప్రభుత్వం ఏపీఐఐసీకి కేటాయించింది, ఇప్పుడు ఇందులో సగానికిపైగా భూములను సోలార్‌ ప్రాజెక్టుకు వినియోగించుకోవాలని జగన్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఆలోచన వచ్చిందే తడవుగా 1,454 ఎకనరాలను గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌కు కేటాయించాలని ఏపీఐఐసీకి తాజాగా ఆదేశాలు ఇచ్చారు. ఇక అక్కడ తలపెట్టిన మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌ను ఏం చేస్తారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

Updated Date - 2020-09-23T10:09:19+05:30 IST