సాఫ్ట్వేర్లమంటూ అసాంఘిక దందా
ABN , First Publish Date - 2022-04-30T18:36:53+05:30 IST
ఇటీవల గచ్చిబౌలిలో ఓ ఇంట్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయనే సమాచారంతో పోలీసులు దాడిచేశారు.
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): ఇటీవల గచ్చిబౌలిలో ఓ ఇంట్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయనే సమాచారంతో పోలీసులు దాడిచేశారు. ఇద్దరు విటులతోపాటు.. కోల్కతాకు చెందిన ఇద్దరు యువతులు పట్టుబడ్డారు. ప్రధాన ఆర్గనైజర్స్ పరారీలో ఉన్నారు. పోలీసులు దర్యాప్తు చేయగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది.
పోలీసులు దాడిచేసిన ఇంటిని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అద్దెకు తీసుకున్నట్లు ఇంటి యజమాని వెల్లడించాడు. నలుగురు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటామని చెప్పాడన్నాడు. అద్దెకు తీసుకున్న వ్యక్తి ఆ ఇంటిని పశ్చిమబెంగాల్కు చెందిన శిల్ప అనే మహిళకు అప్పగించాడు. ఆమె తన అనుచరులతో ఆన్లైన్ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఆన్లైన్లో ఆకర్షించి..
లోకంటో, డేటింగ్ వంటి యాప్లలో అందమైన యువతుల ఫొటోలు పంపిస్తూ యువకులను ఆకర్షిస్తోంది. ఆకర్షణకు లోనైన యువకులతో ఆన్లైన్లోనే బేరం కుదుర్చుకుంటోంది. నచ్చిన యువతిని బట్టి రేటు ఫిక్స్ చేస్తారు. ఆ తర్వాత సమయం, తేదీ చెప్పి విటులను ఆహ్వానిస్తారు. ఇలా ఒక్కో విటుడి నుంచి రూ. 5 వేల నుంచి 7 వేల వరకు డిమాండ్ చేస్తారు.
10 రోజులు.. రూ. 50 వేల సంపాదన
కస్టమర్ల అవసరం, డిమాండ్ మేరకు నిర్వాహకులు పశ్చిమబెంగాల్, ముంబై, బంగ్లాదేశ్, నేపాల్, ఉగాండా, కజకిస్థాన్ ప్రాంతాల నుంచి యువతులను నగరానికి రప్పిస్తున్నారు. ప్రతి కస్టమర్ నుంచి రూ. 5 వేలు ఆపైన తీసుకొంటున్న నిర్వాహకులు.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన యువతులకు వెయ్యిరూపాయలే చెల్లిస్తారు. ఒక్కో యువతికి రోజుకు రూ. 5 వేలు సంపాదన. నగరంలో పదిరోజులు ఉంటే రూ. 50 వేలు తీసుకొని వెళ్తారు. ఆ తర్వాత నిర్వాహకులు మరో బ్యాచ్ను దింపుతారు. ఇలా అవసరాన్ని బట్టి యువతులను రప్పిస్తున్నట్లు విచారణలో తేలింది. పోలీసుల దాడిలో విటులు పట్టుబడుతుండగా.. నిర్వాహకులు తప్పించుకుంటున్నారు.