రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి
ABN , First Publish Date - 2022-01-26T06:14:04+05:30 IST
చౌటుప్పల్ మండలం దండుమల్కాపురంపరిధిలోని హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతిచెందాడు.
చౌటుప్పల్ రూరల్, జనవరి 25: చౌటుప్పల్ మండలం దండుమల్కాపురంపరిధిలోని హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన చింతపల్లి వెంకటసతీష్ (28) హైదరాబాద్ హైటెక్ సిటీలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ కూకట్పల్లిలో నివాసం ఉంటున్నాడు. సంక్రాంతి పండుగకు ఇంటికి వచ్చిన వెంకటసతీష్ సోమవారం రాత్రి 10 గంటలకు స్వగ్రామం వేల్పూరు నుంచి ద్విచక్రవాహనంపై హైదరాబాద్ బయలుదేరాడు. మంగళవారం తెల్లవారుజామున ఐదు గంటలకు దండుమల్కాపురం వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని చౌటుప్పల్లోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతదేహం వద్ద గుర్తించిన ఆధారాలతో కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సైదులు తెలిపారు.