పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో.. TRS-BJP మధ్య ‘సోషల్’ వార్..!
ABN , First Publish Date - 2022-01-11T19:48:33+05:30 IST
పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో.. TRS-BJP మధ్య ‘సోషల్’ వార్..!
హైదరాబాద్ సిటీ/ముషీరాబాద్ : ముషీరాబాద్లో టీఆర్ఎస్, బీజేపీ నాయకుల మధ్య సోషల్ మీడియా వార్ కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ముషీరాబాద్ చేపల మార్కెట్ అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి నిధుల మంజూరీపై ఎమ్మెల్యే ముఠా గోపాల్కు మద్దతుగా టీఆర్ఎస్ నాయకులు, బీజేపీ కార్పొరేటర్ సుప్రియానవీన్గౌడ్కు మద్దతుగా డివిజన్ బీజేపీ నేతలు పోటాపోటీగా పోస్టులు చేస్తున్నారు. దీంతో ముషీరాబాద్లో బీజేపీ, టీఆర్ఎస్ నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విబేధాలు చోటుచేసుకుంటున్నాయి. సోషల్ మీడియాలో ఇరునేతలు సవాళ్లు విసురుకోవడంతోపాటు నిధులు మేమే మంజూరు చేయించామని ఇరు పార్టీల నేతలు పేర్కొంటున్నారు. ముషీరాబాద్లో ఏ కార్యక్రమం జరిగినా, పదిమంది గుమిగూడినా బీజేపీ, టీఆర్ఎస్ నేతలతోపాటు ఇతర పార్టీల నేతలు ఇదే విషయంపై చర్చించుకోవడం హాట్ టాపిక్గా మారింది.