సోషల్ మీడియాలో ‘ఈవీఎం చోర్ బీజేపీ’ ట్రెండ్!

ABN , First Publish Date - 2022-03-10T15:35:55+05:30 IST

ఉత్తరప్రదేశ్‌తో సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు..

సోషల్ మీడియాలో ‘ఈవీఎం చోర్ బీజేపీ’ ట్రెండ్!

ఉత్తరప్రదేశ్‌తో సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని 403 స్థానాలకు ఏడు దశల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు నేడు వెల్లడికానున్నాయి. కాగా ఓట్ల లెక్కింపు నడుమ సోషల్ మీడియాలో ‘ఈవీఎం చోర్ బీజేపీ' ట్రెండ్ అవుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల తర్వాత సమాజ్‌వాదీ పార్టీ ఈవీఎంలపై అనేక ఆరోపణలు చేస్తూవచ్చింది. ఓట్ల లెక్కింపునకు ముందు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా ఈవీఎంలను సంరక్షించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ నేపధ్యంలో పలు చోట్ల ఎస్పీ కార్యకర్తల తోపులాట జరిగింది. ఈ ఎపిసోడ్‌లో ఇప్పుడు ‘ఈవీఎం చోర్ బీజేపీ’ అనే హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగానే సోషల్ మీడియాలో ఇది ట్రెండ్ అయింది. సచిన్ మాలిక్ అనే యూజర్.. ఈవీఎం మెషీన్లను బీజేపీ తారుమారు చేసిందనేది నిజం కాబట్టే ఇది ట్రెండ్ అవుతున్నదని రాశారు. మరో యూజర్ అదే హ్యాష్‌ట్యాగ్‌ కింద.. అధికారులు చాలా చోట్ల ఎన్నికలలో బీజేపీకి లబ్ధి చేకూరుస్తున్నారని ఆరోపించారు. కాగా ఈవీల విషయంలో వారణాసిలో హై వోల్టేజ్ డ్రామా నడిచింది. వందలాది మంది ఎస్పీ కార్యకర్తలు... బీజేపీ నేతలు ఈవీఎంలను మార్చారని ఆరోపిస్తూ నానా హంగామా చేశారు. ఈవీఎంలతో వెళుతున్న వాహనాలను ఆపి, ఆ ఈవీఎంపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ ధర్నాకు దిగారు. దీనికిముందు ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఒక ట్వీట్‌లో  బీజేపీ నేతలు ఓట్ల లెక్కింపులో రిగ్గింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వారణాసిలో ఈవీఎం పట్టుబడిందన్న వార్త దీనికి నిదర్శనమన్నారు. ఇది ఓట్ల లెక్కింపులో రిగ్గింగ్‌కు పాల్పడే ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు ఎస్పీ కూటమి అభ్యర్థులు మద్దతుదారులు తమ కెమెరాలతో సిద్ధంగా ఉండాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని, భవిష్యత్తును కాపాడుకునేందుకు ఓట్ల లెక్కింపులో యువత సైనికుల్లా మారాలని పిలుపునిచ్చారు. 




Updated Date - 2022-03-10T15:35:55+05:30 IST