విశాఖ నుంచి యూఏఈకి విమాన సౌకర్యం కల్పనపై సానుకూల స్పందన
ABN , First Publish Date - 2022-09-24T19:02:24+05:30 IST
ఆంధ్ర ప్రదేశ్ కార్యనిర్వాహక రాజధాని విశాఖ పట్టణం నుంచి యూఏఈ (UAE)కి విమాన సౌకర్యం కల్పన కోసం యూఏఈలోని తెలుగు ప్రముఖులు, సామాజిక వేత్త యలమర్తి శరత్ సలుపుతున్న నిర్విరామ కృషి, ఉద్యమంతో ఏపీఎన్ఆర్టీఎస్ (APNRTS) ప్రాంతీయ సమన్వయకర్త ప్రసన్న సోమిరెడ్డి కలిసి వారి కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వముతో సమన్వయం చేస్తామన్నారు.
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్లోని విశాఖ పట్టణం నుంచి యూఏఈ (UAE)కి విమాన సౌకర్యం కల్పన కోసం యూఏఈలోని తెలుగు ప్రముఖులు, సామాజిక వేత్త యలమర్తి శరత్ సలుపుతున్న నిర్విరామ కృషి, ఉద్యమంతో ఏపీఎన్ఆర్టీఎస్ (APNRTS) ప్రాంతీయ సమన్వయకర్త ప్రసన్న సోమిరెడ్డి కలిసి వారి కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వముతో సమన్వయం చేస్తామన్నారు. తెలుగు వారి చిరకాల కోరిక అయిన విశాఖ-యూఏఈ విమాన ప్రయాణ సౌకర్య సాధనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ద్వారా సంబంధిత కేంద్ర ప్రభుత్వ శాఖలపై ఒత్తిడి తేవడానికి కలిసి పయనించడానికి నిర్ణయం తీసుకున్నారు. విశాఖ-యూఏఈ మార్గంలో విమాన అవశ్యకతను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారులు జ్ఞానేంద్ర రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. దీనిలో భాగంగా వృద్దులు, చంటి పిల్లలు, మహిళలు యూఏఈకి అందుబాటులో లేని విమాన ప్రయాణ సౌకర్యము కారణంగా పడుతున్న ఇబ్బందులను తెలియజేశారు. సముద్ర ఉత్పత్తులు, పళ్లు, కూరగాయల ఎగుమతికి అందివచ్చే అవకాశాలను కూడా వివరించడం జరిగింది. దీనికి ఆయన వెంటనే స్పందించి నిన్న(శుక్రవారం) కుప్పంలోముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసి వివరాలను సమర్పించారు. అందుకు సీఎం నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు సమాచారం.