చెట్టు తొర్రలో కొండచిలువ

ABN , First Publish Date - 2021-06-25T05:53:14+05:30 IST

చెట్టు తొర్రలో కొండచిలువ

చెట్టు తొర్రలో కొండచిలువ

ఉంగుటూరు, జూన్‌ 24 : కాల్వగట్టు పక్కనే భారీ చెట్టు.. చెట్టు మొదల్లో పెద్ద తొర్ర.. ఆ తొర్రలో 12 అడుగుల కొండచిలువ.. దాని మధ్యలో లెక్కకుమించి గుడ్లు.. కాశీమజిలీ కథ కాదండోయ్‌. ఉంగుటూరు మండలం పొట్టిపాడు గ్రామంలో గురువారం కనిపించిన నిజం ఇది. ఉడుమును పట్టుకునేందుకు కొంతమంది యువకులు బుధవారం రాత్రి వల పెట్టి, గురువారం ఉదయం వెళ్లి చూశారు. అది చిరిగిపోయి కనిపించింది. అనుమానంతో పక్కనే ఉన్న ఏలూరు కాల్వగట్టు పై ఉన్న చెట్టు మొదల్లో చూశారు. ఇంకేముంది.. పెద్దపాము కదలాడుతూ కనిపించింది. భయపడిపోయిన యువకులు సర్పంచ్‌కు సమాచారమందించారు. సర్పంచ్‌ కత్తుల జ్యోతి స్థానిక పోలీసులకు సమాచారమందించగా, వారు అటవీశాఖ అధికారులకు తెలియజేశారు. ఫారెస్ట్‌ అధికారులు వచ్చేంత వరకు చెట్టు తొర్రలో నుంచి కొండచిలువ బయటకు రాకుండా స్థానికులు కాపలా కాశారు. స్థానికుల హడావుడితో కొండచిలువ భయపడిపోయి గుడ్లను బయటకు తోసేసి మరింత లోపలికి వెళ్లింది. బయటపడిన పది గుడ్లను స్థానికులు పగలగొట్టగా, అందులో నుంచి చిన్నచిన్న కొండచిలువ పిల్లలు బయటకువచ్చి చనిపోయాయి. ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ కమల్‌, స్నేక్‌ స్నాచర్‌, పోలీస్‌ సిబ్బంది నరేష్‌, అంజయ్య, స్థానిక యువకుల సహాయంతో తొర్రలో దాక్కున్న కొండచిలువను బయటకు తీశారు. ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ కమల్‌ మాట్లాడుతూ పట్టుబడ్డ కొండచిలువ పొడవు సుమారు 12 అడుగులుంటుందని, ఏలూరు కాల్వకు నీరు విడుదలచేసే సందర్భంలో ప్రవాహంలో కొట్టుకొచ్చి ఉంటుందన్నారు.



Updated Date - 2021-06-25T05:53:14+05:30 IST