ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా చిరుధాన్యాలు!
ABN , First Publish Date - 2021-09-18T09:12:01+05:30 IST
రాబోయే రోజుల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా చిరు ధాన్యాలు అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ తెలిపారు.
- పేద, ధనిక అని తేడా లేకుండా ఆహారంలో భాగం చేస్తాం
- కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్
హైదరాబాద్/ రాజేంద్రనగర్, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): రాబోయే రోజుల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా చిరు ధాన్యాలు అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ తెలిపారు. పేదలు, ధనికులు అనే తేడా లేకుండా అందరి ఆహారంలో వీటిని భాగం చేస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో రెండు రోజుల పాటు నిర్వహించనున్న పోషక ధాన్యాల మహా సమ్మేళనం-3.0ను శుక్రవారం తోమర్ ప్రారంభించారు. రాజేంద్రనగర్లోని ఐఐఎంఆర్ని సందర్శించారు. చిరుధాన్యాల ఉత్పత్తిలో భారత్ ఇప్పటికే క్రియాశీల పాత్ర పోషిస్తున్నదని.. 2023 నాటికి మన దేశం మొత్తంతో పాటు ప్రపంచానికి కూడా అందించేందుకు కృషిచేస్తామని తోమర్ చెప్పారు. అనుకూల వాతావరణం, భూములు ఉన్నందున తెలంగాణలో ఆయిల్పామ్ సాగును పెంచాలని కోరారు.
ఆయిల్ పామ్ విత్తనాలపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించండి: సోమేశ్
రికార్డు స్థాయిలో 20 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ ప్లాంటేషన్ చేపడుతున్న నేపథ్యంలో.. విత్తనాలకు కస్టమ్స్ సుంకాన్ని తగ్గించాలని కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సంజయ్ అగర్వాల్ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ కోరారు. ఐఐఎంఆర్లో ఆయనతో భేటీ అయ్యారు. మరోవైపు వ్యవసాయ రంగంలో చేపట్టిన కార్యక్రమాలను కేంద్ర మంత్రి తోమర్కు వివరించారు.