Smriti Defamation case: కాంగ్రెస్ నేతలకు హైకోర్టు సమన్లు, ట్వీట్లు తీసేయాలని ఆదేశం

ABN , First Publish Date - 2022-07-29T20:58:50+05:30 IST

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వేసిన పరువునష్టం కేసులో కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్, పవన్ ఖెరా, నెట్ట డిసౌజాలకు ఢిల్లీ హైకోర్టు శుక్రవారంనాడు..

Smriti Defamation case: కాంగ్రెస్ నేతలకు హైకోర్టు సమన్లు, ట్వీట్లు తీసేయాలని ఆదేశం

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) వేసిన పరువునష్టం కేసులో (Defamation case) కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్, పవన్ ఖెరా, నెట్ట డిసౌజాలకు ఢిల్లీ హైకోర్టు శుక్రవారంనాడు సమన్లు పంపింది. స్మృతి ఇరానీ, ఆమె కుమార్తెపై సోషల్ మీడియాలో చేసిన ట్వీట్లు, రీట్వీట్లు, పోస్ట్‌లు, వీడియోలు, ఫోటోలు తొలగించాలని వారిని ఆదేశించింది. తమ ఆదేశాలను 24 గంటల్లోగా ప్రతివాదులు అమలు చేయడంలో విఫలమైతే సోషల్ మీడియా వేదికలైన ట్విట్టర్, ఫేస్‌బుక్, యూట్యూబ్ సంబంధిత మెటిరీయల్‌ను తొలగించాలని కోర్టు పేర్కొంది. జస్టిస్ మిని పుష్కర్ణ ఈ ఆదేశాలు ఇచ్చారు. తనపైన, తన కుమార్తె పైన నిరాధార ఆరోపణలు చేశారంటూ రూ.2 కోట్లకు స్మృతి ఇరానీ కాంగ్రెస్ నేతలపై సివిల్ డిఫమేషన్ కేసు వేశారు.


జైరామ్ రమేష్ స్పందన...

కాగా, కోర్టు ఆదేశాలపై జైరామ్ రమేష్ స్పందించారు. వాస్తవాలను తాము కోర్టు ముందు ఉంచుతామని అన్నారు. తాము చెప్పిన విషయాలను స్మృతి ఇరానీ వక్రీకరించి చెప్పారని, ఆ విషయాలను కోర్టుకు తెలియజేస్తామన్నారు. 18 ఏళ్ల వయసున్న స్మృతి ఇరానీ కుమార్తె జోయిష్ ఇరానీ గోవాలో అక్రమంగా బార్ నడుపుతున్నారని కాంగ్రెస్ నేతలు ఇటీవల ఆరోపణలు చేశారు. స్మృతి ఇరానీని మంత్రి పదవి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలను స్మృతి ఇరానీ తోసిపుచ్చారు. తన కుమార్తె చదువుకుంటున్న విద్యార్థిని అని, ఎలాంటి బార్ నడపడం లేదని అన్నారు. కేవలం రాహుల్, సోనియాగాంధీ రూ.5000 కోట్లు లూటీ చేశారని తాను ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్పినందునే తన కుమార్తెపై  కాంగ్రెస్ నేతలు అభాండాలు వేస్తున్నారని అన్నారు.

Updated Date - 2022-07-29T20:58:50+05:30 IST