స్మార్ట్ యోజన సంస్థ ఉద్యోగులు ర్యాలీ, ధర్నా
ABN , First Publish Date - 2022-08-09T07:03:32+05:30 IST
ప్రభుత్వ ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను మోసగించి లక్షలాది రూపాయలు వసూలు చేశారని, వాటిని తిరిగి చెల్లించాలని సోమవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో స్మార్ట్ యోజన సంస్థ ఉద్యోగులు నర్సీపట్నంలో ర్యాలీ, సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.
అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్సులు వసూలు చేశారని ఆర్డీవో, ఏఎస్పీలకు ఫిర్యాదు
నర్సీపట్నం అర్బన్, ఆగస్టు 8: ప్రభుత్వ ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను మోసగించి లక్షలాది రూపాయలు వసూలు చేశారని, వాటిని తిరిగి చెల్లించాలని సోమవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో స్మార్ట్ యోజన సంస్థ ఉద్యోగులు నర్సీపట్నంలో ర్యాలీ, సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. అనంతరం ఆర్డీవో బీహెచ్ భవానీ శంకర్కు వినతిపత్రం అందించారు. అలాగే ఏఎస్పీ మణికంఠ చందోలుకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2018 నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి తమ వద్ద నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారన్నారు. స్మార్ట్ వెల్ఫేర్ ఉద్యోగుల పేరిట వసూలు చేశారన్నారు. ఈ సంస్థలో పనిచేసిన ఉద్యోగులకు 11 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదన్నారు. ఇలా డబ్బులు వసూలు చేసిన సంస్థ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యులు ఎల్వీ రమణ, పాడేరు డివిజన్ నాయకులు అమర్నాథ్, జనసేన నాయకులు దూలం గోపి తదితరులు పాల్గొన్నారు.
స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులపై కేసు నమోదు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్లానింగ్ డిపార్టుమెంట్ల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులను మోసగించిన స్మార్ట్ యోజన వెల్ఫేర్ సంస్థ ప్రతినిధులపై సోమవారం కేసు నమోదు చేసినట్టు నర్సీపట్నం టౌన్ ఎస్ఐ గోవిందరావు తెలిపారు. ఎస్ఐ అందించిన వివరాలిలా ఉన్నాయి. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని సుబ్బరాయుడుపాలెం గ్రామానికి చెందిన దేవాడ రమణ నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్లానింగ్ డిపార్టుమెంట్ల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇస్తామని అనకాపల్లికి చెందిన స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధి ఇందుపూడి సుధాకర్తోపాటు మరికొంత మంది నమ్మబలికి తన వద్ద నుంచి రూ.లక్షా 60వేలు తీసుకున్నారని ఫిర్యాదు చేసినట్టు ఎస్ఐ గోవిందరావు తెలిపారు. అందిన ఫిర్యాదు మేరకు చీటింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్టు ఆయన తెలిపారు.