‘స్మార్ట్‌’ బూచాడొద్దు!

ABN , First Publish Date - 2022-01-22T07:47:30+05:30 IST

ఇప్పుడిది వాట్సాప్‌ లోకం. ఒక్క షేర్‌ చాలు.. ఏ రహస్యమైనా బట్టబయలవుతుంది. షేర్‌ల మీద షేర్‌లతో జెట్‌ వేగంతో అందరి గుప్పిట్లోకీ వెళ్లిపోతుంది. మామూలు విషయాలైతే పర్వాలేదు. జాతీయ భద్రత..

‘స్మార్ట్‌’ బూచాడొద్దు!

భేటీల్లో స్మార్ట్‌ ఫోన్లు, స్మార్ట్‌ వాచ్‌లు ఉపయోగించకండి

వాట్సాప్‌, టెలిగ్రామ్‌లో డాక్యుమెంట్లు షేర్‌ చేయొద్దు

రహస్య సమాచార షేరింగ్‌కు వైఫై వినియోగించొద్దు

వర్చువల్‌ భేటీలకు గూగుల్‌ మీట్‌, జూమ్‌ యాప్‌లు వాడొద్దు

దేశ వ్యతిరేక శక్తులు దుర్వినియోగం చేసే ప్రమాదం

సీ-డాక్‌, ఎన్‌ఐసీ రూపొందించిన వీడియో కాన్ఫరెన్స్‌.. 

‘వర్క్‌ ఫ్రమ్‌ హోం’లో ఈ-ఆఫీస్‌ అప్లికేషన్లే వాడండి

కేంద్రమంత్రులు, అన్ని విభాగాల ఉన్నతాధికార్లకు ఆదేశాలు

జాతీయ సమాచార మార్గదర్శకాలకు సవరణలు


న్యూఢిల్లీ, జనవరి 21: ఇప్పుడిది వాట్సాప్‌ లోకం. ఒక్క షేర్‌ చాలు.. ఏ రహస్యమైనా బట్టబయలవుతుంది. షేర్‌ల మీద షేర్‌లతో జెట్‌ వేగంతో అందరి గుప్పిట్లోకీ వెళ్లిపోతుంది. మామూలు విషయాలైతే పర్వాలేదు. జాతీయ భద్రత అంశాల మీద కేంద్ర ప్రభుత్వం గోప్యంగా ఉంచే సమాచారాలు గానీ.. విధానపరమైన నిర్ణయాల దిశగా రహస్యంగా ఉంచే ప్రతిపాదనలు, ప్రణాళికలు గానీ ఇలా బయటకు పొక్కితే? ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ల వినియోగం బాగా పెరిగిపోవడంతో కీలక భేటీల్లో చర్చించే అంశాలు, ఆ తాలుకు ఫైళ్లు క్షణాల్లో వాట్సా్‌పలో చక్కర్లు కొడుతున్నాయి.


దీనికి చెక్‌ పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇక నుంచి సమావేశాల్లో అధికారులు వాట్సా్‌ప, టెలిగ్రామ్‌ తదితర యాప్‌లను ఉపయోగించేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. కీలక డాక్యుమెంట్లను వాట్సా్‌పలో షేర్‌ చేయొద్దని, సమావేశాల్లో స్మార్ట్‌ఫోన్‌లను, స్మార్ట్‌ వాచ్‌లను ఉపయోగించకూడదని నిర్దేశించింది. కరోనా నేపథ్యంలో అమలవుతున్న ‘వర్క్‌ ఫ్రమ్‌ హోం’ (ఇంటి నుంచే పని)కూ ఇది వర్తిస్తుందని స్పష్టీకరించింది. ఈ మేరకు కేంద్రమంతులు ‘తక్షణ చర్యలు’ చేపట్టాలని.. రహస్య సమాచారాల పరంగా స్మార్ట్‌ఫోన్‌ వినియోగించడాన్ని నిరోధించాలని, ఆ మేరకు సమాచార భద్రతా విధానాలు, మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది!


జాతీయ సమాచార మార్గదర్శకాల్లోని లోపాలను ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీలు సమీక్షించిన మీదట సవరించిన సమాచార మార్గదర్శకాలను కేంద్రం సూత్రీకరించింది. ఈ మేరకు కొత్త నిబంధనలు కేంద్ర మంత్రులు, సంబంధిత ఉన్నతాధికారులకు వెళ్లాయి. జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలపై భేటీల్లోనూ స్మార్ట్‌ ఫోన్లు, స్మార్ట్‌ వాచ్‌లు ఉపయోగించరాదని అందులో పేర్కొన్నారు.


సవరించిన మార్గదర్శకాల్లో 

ఏం చెప్పారు? 

కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. వాట్సాప్‌, టెలిగ్రామ్‌ వంటి సర్వర్లు విదేశాలకు చెందిన ప్రైవేటు కంపెనీల నియంత్రణలో ఉంటాయి. రహస్య సమాచారాన్ని వాటిల్లో షేర్‌ చేయకూడదు. ‘వర్క్‌ఫ్రమ్‌ హోం’లోనూ ఈ-ఆఫీస్‌ అప్లికేషన్లను మాత్రమే ఉపయోగించాలి. వైఫై బదులు ఇంటి వద్ద సిస్టమ్స్‌ అధికారిక నెట్‌వర్క్‌తో నేషనల్‌ ఇన్ఫర్మేటిక్‌ సెంటర్‌(ఎన్‌ఐసీ) వర్చువల్‌ ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ద్వారా అనుసంధానమై,  ఉండాలి. రహస్య డాక్యుమెంట్లను ప్రభుత్వ అధికారులు తమ ఫోన్లలో స్టోర్‌ చేసుకోరాద. వర్చువల్‌ సమావేశాలను డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సీ-డీఏసీ), ఎన్‌ఐసీ రూపొందించిన వీడియో కాన్ఫరెన్స్‌ వ్యవస్థనే ఉపయోగించాలి.

Updated Date - 2022-01-22T07:47:30+05:30 IST