చిన్న డ్రోన్లు పెద్ద మార్పులు
ABN , First Publish Date - 2022-05-28T07:40:11+05:30 IST
‘‘ప్రతి ఒక్కరి చేతికి స్మార్ట్ఫోన్ అందాలి. ప్రతి పొలంలో డ్రోన్ తిరగాలి. ప్రతి ఇంట సౌభాగ్యం నిండాలి.
ప్రతి చేతికీ స్మార్ట్ఫోన్, పొలంలో డ్రోన్, ఇంట సౌభాగ్యమే ‘ఆజాదీ అమృత్’ కల
భారత్ డ్రోన్ మహోత్సవంలో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ, మే 27 : ‘‘ప్రతి ఒక్కరి చేతికి స్మార్ట్ఫోన్ అందాలి. ప్రతి పొలంలో డ్రోన్ తిరగాలి. ప్రతి ఇంట సౌభాగ్యం నిండాలి. ఆజాదీ అమృత్ మహోత్సవం వేళ నేను ఈ కల కంటున్నాను’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. టెక్నాలజీని గత ప్రభుత్వాలు ఒక సమస్యగా, పేదల వ్యతిరేక విధానంగా చూడగా... నూతన ఉపాధి, ఉద్యోగ అవసరాలకు వనరుగా తాము దానిని ఎనిమిదేళ్లలోనే మలిచివేశామని మోదీ అన్నారు. డ్రోన్లు వచ్చి సాగు రంగాన్ని మలుపు తిప్పాయని ఆయన చెప్పారు. ఢిల్లీలో శుక్రవారం జరిగిన భారత్ డ్రోన్ మహోత్సవంలో ప్రధాని పాల్గొన్నారు. ‘‘పెద్ద మార్పులకు చిన్న డ్రోన్లే శోధకాలు. గ్రామాల్లో ఆస్తుల మ్యాపింగ్కు తొలిసారి డ్రోన్ టెక్నాలజీ వినియోగిస్తున్నారు’’ అని వివరించారు. డ్రోన్ టెక్నాలజీకి అందిస్తున్న ప్రోత్సాహంతో గుడ్ గవర్నెన్స్ విధానం మరో మెట్టు పైకి చేరిందని మోదీ వివరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింథియా, మన్సూఖ్ మాండవీయ, అశ్వినీ వైష్ణవ్, గిరిరాజ్ సింగ్ పాల్గొన్నారు.
డ్రోన్ ఎగరేసిన మోదీ
డ్రోన్ల మహోత్సవ ప్రాంగణంలో ప్రధాని మోదీ సరదాగా గడిపారు. డ్రోన్ల పనితీరును తెలుసుకునేందుకు ఆసక్తి చూపించారు. ఈ క్రమంలో ఓ డ్రోన్ను ఎగరవేయడానికి ప్రయత్నించారు. ఈ డ్రోన్ను బెంగళూరుకు చెందిన ఆస్టేరియా ఎయిరోస్పేస్ లిమిటెడ్ అనే సంస్థ తయారుచేసింది.