మద్దతు ధరకే పత్తి కొనుగోలు
ABN , First Publish Date - 2020-10-29T08:44:06+05:30 IST
ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే పత్తిని కొనుగోలు చేయాలని జాయింట్ కలెక్టర్ సుమిత్కుమార్ అధికారులను ఆదేశించారు.
రాజాంలో నేడు కొనుగోలు కేంద్రం ప్రారంభం
జాయింట్ కలెక్టర్ సుమిత్కుమార్
కలెక్టరేట్, అక్టోబరు 28: ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే పత్తిని కొనుగోలు చేయాలని జాయింట్ కలెక్టర్ సుమిత్కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం తన ఛాంబర్లో సంబంధిత అధికారులతో జేసీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ.. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు రాజాం మార్కెట్ యార్డులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కేంద్రాన్ని రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు గురువారం ప్రారంభించనున్నట్లు తెలిపారు. మేలు రకం పత్తికి క్వింటాకు రూ.5,825, రెండో రకానికి రూ.5,515 మద్దతు ధర నిర్ణయించినట్లు చెప్పారు. తేమ శాతం 8 నుంచి 12 ఉండాలన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో రైతులు తమ పేర్లు నమోదు చేయించుకోవాలని సూచించారు.
ముందుగా ఈ క్రాప్లో నమోదు కావాలన్నారు. దీనిపై రైతులకు అధికారులు అవగాహన కల్పించాలని జేసీ తెలిపారు. సమావేశంలో మార్కెటింగ్ శాఖ ఏడీ బి.శ్రీనివాసరావు, ఏఎస్పీ సోమశేఖర్, రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్ వడ్డి సుందర్, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధి ప్రవీణ్, వ్యవసాయశాఖ ఏడీ సుధారాణి, అగ్నిమాపక శాఖ అధికారి ఎంకేఎం రాజు, మార్కెట్ కమిటీ కార్యదర్శి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.