ఆ స్వరం ఇక వినపడదని తెలిసి కళా రంగం మూగబోయింది
ABN , First Publish Date - 2020-09-26T10:45:18+05:30 IST
ఆ స్వరం ఇక వినపడదని తెలిసి కళా రంగం మూగబోయింది. ఆ గొంతు నుంచి తేనెలూరే పాటలు ఇక జాలువరవని తెలిసి సంగీత లోకం చిన్నబోయింది.
(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, సెప్టెంబరు 25);
ఆ పాట మాధుర్యాన్ని ఇక ఆస్వాదించలేమని తెలిసి.. సిక్కోలు ప్రజానీకం కన్నీరు పెడుతోంది. గాన గంధర్వుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మృతితో అంతటా అంతులేని విషాదం అలముకుంది.
జిల్లావాసులు, కళాకారులతో ఆయనకు విడదీయరాని బంధం ఉంది. జిల్లాతోనూ... వ్యక్తిగతంగా ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని అభిమానులంతా గుర్తు చేసుకున్నారు. సిక్కోలుకు రెండు, మూడు దఫాలు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విచ్చేశారు. ఎప్పుడు వచ్చినా ఆద్యంతం హుషారుగా ఉంటూ.. తన పాటలతో అభిమానులను ఉర్రూతలూగించేవారు.
తొలిసారిగా 1983లో జిల్లాకు చెందిన సంగీత వాయిద్య కళాకారులు బండారు చిట్టిబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సుకుమార ఆర్కెష్ట్రా’ జూబ్లీ వారోత్సవాల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రెండు పాటలను ఆలపించి.. అభిమానులను మెప్పించారు.
శ్రీకాకుళంలో గత ఏడాది జనవరిలో శ్రీ సుమిత్రా కళా సమితి ఆధ్వర్యంలో ‘బాలు స్వరాంజలి’ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుమారుడు ఎస్పీ చరణ్, సోదరి ఎస్పీ శైలజతో కలిసి బాలసుబ్రహ్మణ్యం హాజరయ్యారు. ముందుగా అరసవల్లి ఆదిత్యుని దర్శించుకున్నారు. అనంతరం నిర్వహించిన సంగీత కార్యక్రమంలో సందడి చేశారు.
కుమారుడు, సోదరి, ఇతర గాయకులతో కలిసి సుమారు 40 పాటలకుపైగా ఆయన ఆలపించారు. చాలా హుషారుగా, స్టెప్పులేస్తూ.. ఆడుతూ.. గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా శ్రీ సుమిత్రాకళాసమితి సభ్యులు ఆయనను ఘనంగా సన్మానించారు. గజమాలతో సత్కరించి దుశ్శాలువ, జ్ఞాపికను బహుకరించారు. అప్పటి శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ఈ కార్యక్రమంలో పాల్గొని బాలసుబ్రహ్మణ్యాన్ని సత్కరించారు.
ఆ దృశ్యాలను ఇప్పటికీ మరువలేకున్నామని జిల్లా ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా.. ఆయన పాట ఈ సృష్టి ఉన్నంతవరకూ బతికే ఉంటుందంటూ పలువురు ఎస్పీ బాలుకి నివాళులర్పించారు. తమ గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న బాలు ఆత్మకు శాంతి చేకూరాలని అభిమానులంతా ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నారు.