Congress Party: ఆరు నెలల ముందే అభ్యర్థుల ప్రకటన

ABN , First Publish Date - 2022-09-27T18:03:16+05:30 IST

రాష్ట్రంలో ఎలాగైనా అధికార పగ్గాలను జేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్న కాంగ్రెస్‌ పార్టీ(Congress Party) శాసనసభ ఎన్నికలకు

Congress Party: ఆరు నెలల ముందే అభ్యర్థుల ప్రకటన

- సన్నాహాలు చేపట్టిన కాంగ్రెస్‌ 

- నవంబరు నాటికి నియోజకవర్గాల వారీగా సమీక్షలు


బెంగళూరు, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎలాగైనా అధికార పగ్గాలను జేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్న కాంగ్రెస్‌ పార్టీ(Congress Party) శాసనసభ ఎన్నికలకు ఆరు నెలల ముందుగానే తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించే సన్నాహాల్లో ఉంది. కనీసం 150 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇలా ముందస్తుగానే అభ్యర్థుల పేర్లను ప్రకటించడం వల్ల ప్రచారానికి బోలెడు సమయం లభిస్తుందని, పైగా చివరి నిమిషంలో అభ్యర్థుల పేర్లను ప్రకటించడం వల్ల తలెత్తే అసంతృప్తి, తిరుగుబాట్లు తదితర సమస్యలు ఉండవని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. పార్టీ అధిష్టానం సూచన మేరకు ఎన్నికల వ్యూహకర్త సునీల్‌ కునుగోళ్‌ నాయకత్వంలోని నిపుణుల బృందం ప్రస్తుతం మొత్తం 224 శాసనసభా ని యోజకవర్గాల్లో కాంగ్రెస్‌ విజయావకాశాలను బేరీజు వేయడంలో నిమగ్నమై ఉంది. నవంబరు చివరి వారంలో ఈ సమీక్షా నివేదికను ఏఐసీసీకి సమర్పించనుంది. పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశాలు అధికంగా ఉన్న 150 నియోజకవర్గాల జాబితాను తొలుత సిద్ధంచేయనున్నట్లు పార్టీ సీనియర్‌ నేత ఒకరు నగరంలో సోమవారం మీడియాకు చెప్పారు. ప్రజాభిప్రాయం ద్వారానే ప్రతి అభ్యర్థి అనుకూల, ప్రతికూల అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆపై డిసెంబరు నాటికి తొలి జాబితాను అధిష్టానమే స్వయంగా ప్రకటించే అవకాశం ఉందని వివరించారు. ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం ముగ్గురు అభ్యర్థుల పేర్లను ఫైనల్‌ జాబితాలో చేర్చనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 50 శాసనసభా నియోజకవర్గాల విషయంలో ఎలాంటి సమస్యా లేదని, వీటికి ఒక్కో అభ్యర్థి పేరునే సిఫార్సు చేసే అవకాశం ఉందన్నారు. వీరిలో అత్యధికులు సీనియర్లు, సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఉంటారన్నారు. గత ఎన్నికల్లో వెయ్యిలోపు ఓట్ల తేడాతో ఓడిపోయిన నియోజకవర్గాలపై ఈసారి ప్రత్యేకంగా దృష్టి సారించాలని పార్టీ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ భారత్‌జోడో యాత్ర రాష్ట్రంలో 21 రోజుల పాటు కొనసాగనుండటంతో ఈ యాత్ర ద్వారా గరిష్టంగా రాజకీయ లబ్ధిని అందుకునేలా కాంగ్రెస్‌ నేతలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. శాసనసభ ఎన్నికలయ్యేంతవరకు కర్ణాటక(Karnataka)పైనే పూర్తిగా దృష్టి సారించాల్సిందిగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్‏సింగ్‌ సుర్జేవాలాకు అధిష్టానం పెద్దలు ఇప్పటికే సూచన చేశారని తెలిసింది. కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ వర్గీయులు, ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య వర్గీయులను ఏకతాటిపైకి తీసుకురావడం ద్వారా పార్టీ శ్రేణుల్లో బలమైన సందేశాన్ని పంపించే దిశలో ఆయన వరస సమావేశాలతో ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు.

Updated Date - 2022-09-27T18:03:16+05:30 IST