Srilanka: ఆరుగురు భారత జాలర్లను అరెస్టు చేసిన శ్రీలంక నేవీ
ABN , First Publish Date - 2022-08-29T01:11:14+05:30 IST
అక్రమంగా తమ ప్రాదేశికి జలాల్లోకి అడుగుపెట్టారనే కారణంతో ఆరుగురు భారత జాలర్లను శ్రీలంక నావికాదళం..
కొలంబో: అక్రమంగా తమ ప్రాదేశికి జలాల్లోకి అడుగుపెట్టారనే కారణంతో ఆరుగురు భారత జాలర్లను (Indian fishermen) శ్రీలంక నావికాదళం (Srilanka Navy) అరెస్టు చేసింది. వారి పడవలను స్వాధీనం చేసుకుంది. నెల రోజుల్లో ఈ తరహా ఘటన చోటుచేసుకోవడం ఇది రెండోసారి. మన్నార్ ఐలాండ్ వాయవ్య తీర ప్రాంతంలోని సెటిల్మెంట్ తలైమన్నార్ వద్ద మత్స్యకారులను అరెస్టు చేసినట్టు నేవీ ఒక ప్రకటనలో తెలిపింది. వీరిని మన్నార్లోని ఫిషరీస్ ఇన్స్పెక్టర్కు అప్పగించనున్నట్టు తెలిపింది. దీనికి ముందు, ఆగస్టు 22న తమ జలాల్లోకి అడుగుపెట్టారంటూ 10 మంది భారత జాలర్లను శ్రీలంక అదుపులోకి తీసుకుంది.
భారత్, శ్రీలంక మధ్య మత్స్యకారుల వివాదం ఎడతెగని అంశంగా ఉంటోంది. శ్రీలంక జలాల్లో విదేశీ మత్స్యకారుల ప్రభావం ఉంటుంది. వారిలో తమిళనాడుకు చెందిన వారు ఎక్కువగా ఉంటుంటారు. శ్రీలంక మత్స్య సంపదను కాపాడుకోవడానికి, అక్రమంగా చేపలు పట్టే కార్యకలాపాలను అరికట్టడానికి నేవీ క్రమం తప్పకుండా పెట్రోలింగ్ నిర్వహిస్తుంటుంది. శ్రీలంకలోని జాఫ్నా జిల్లా, భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రం మధ్య పాల్గ్ జలసంధి (palk strait) ఉంది. ఇరుదేశాల మత్స్యకారులకు ఇది అపార మత్స్య సంపదగా ఉంది.