శివరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలి

ABN , First Publish Date - 2021-02-26T06:16:29+05:30 IST

కోటిపల్లి పుణ్యక్షేత్రంలో మార్చి 10 నుంచి 12 వరకూ జరిగే మహాశివరాత్రి ఉత్సవాలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని ట్రైనీ కలెక్టర్‌ అపరాజితాసింగ్‌ అన్నారు.

శివరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలి

  • ట్రైనీ కలెక్టర్‌ అపరాజితాసింగ్‌

కె.గంగవరం, ఫిబ్రవరి 25: కోటిపల్లి పుణ్యక్షేత్రంలో మార్చి 10 నుంచి 12 వరకూ జరిగే మహాశివరాత్రి ఉత్సవాలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని ట్రైనీ కలెక్టర్‌ అపరాజితాసింగ్‌ అన్నారు. ఛాయాసోమేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు రామచంద్రపురం ఆర్డీవో గాంధీ అధ్యక్షతన గురువారం జరిగిన సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా విచ్చేసి సమీక్ష చేశారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ దర్శనం కలిగించాలన్నారు. దీనికోసం వివిధ శాఖల అధికారులు చేసే ఏర్పాట్లను శాఖలవారీ సమీక్షించారు. శానిటేషన్‌కు అధిక ప్రాధాన్యమివ్వాలని, లైన్లలో సామాజిక దూరం ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. తాగునీరు, పురుషులు, స్ర్తీలకు విడివిడిగా టాయిలెట్‌లు ఏర్పాటు చేయాలని, పార్కింగ్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతిష్టాత్మకంగా జరిగే ఉత్సవాల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన సమావేశానికి అధిక శాతం అధికారులు హాజరు కాకపోవడంపై గ్రామ ప్రముఖుడు రేవు శ్రీను అభ్యంతరం వ్యక్తం చేశారు. తదుపరి సమావేశాలకు అన్ని శాఖల అధికారులు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ట్రైనీ కలెక్టర్‌ను కోరారు. గ్రామస్థుల దర్శనానికి సహకరించాలని సర్పంచ్‌ పెమ్మాడి బేబి సత్తిబాబు సభలో కోరారు. 40మంది సిబ్బందిని పారిశుధ్య నిర్వహణకు నియమిస్తున్నట్టు డీఎల్‌పీవో జె.సత్యనారాయణ చెప్పారు. వీరు ఉత్సవం జరిగే మూడురోజులు 24 గంటలు పారిశుధ్య నిర్వహణ చేసేలా షిప్టుల వారీ విధులు కేటాయిస్తామని వివరించారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకోసం 61 ప్రత్యేక బస్సులు నడుపుతామని ఆర్టీసీ రామచంద్రపురం డిపో మేనేజర్‌ కె.వెంకటేశ్వరరావు చెప్పారు. ఈవో కె.రామచంద్రరావు భక్తుల దర్శనం కోసం ఏర్పాటు చేస్తున్న లైన్లు, ప్రత్యేక దర్శనం లైన్లు, ఆలయం లోపల తాగునీరు అందించే ఏర్పాట్లను వివరించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు కర్రి చిట్టిబాబు, అయినవిల్లి వీరవెంకట సత్యనారాయణ(అబ్బు), డీఎస్పీ రామచంద్రరెడ్డి, సీఐ శ్రీనివాసు, ఎస్‌ఐ రమేష్‌, ఎంపీడీవో వి.అబ్రహం లింకన్‌, తహశీల్దార్‌ జీవీఎస్‌ ప్రసాద్‌ ఇరిగేషన్‌, డీఈ పోచారావు, ఆర్‌డబ్యూఎస్‌ ఏఈ అనిల్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-02-26T06:16:29+05:30 IST