డబ్బు కోసం తల్లిని వదిలేసిన క్రూరుడంటూ సిద్ధూపై ఆరోపణలు

ABN , First Publish Date - 2022-01-28T21:32:53+05:30 IST

పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ డబ్బు కోసం తన తల్లిని

డబ్బు కోసం తల్లిని వదిలేసిన క్రూరుడంటూ సిద్ధూపై ఆరోపణలు

చండీగఢ్ : పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ డబ్బు కోసం తన తల్లిని వదిలేశారని ఆయన సోదరి సుమన్ టుర్ ఆరోపించారు. అమెరికాలో నివసిస్తున్న సుమన్ టుర్ ఆయన ఓ ‘క్రూరుడు’ అని మండిపడ్డారు. చండీగఢ్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆమె ఈ ఆరోపణలు చేశారు. తన ఆరోపణలకు అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పారు. 


1986లో అత్యంత కష్టకాలంలో తమను సిద్ధూ వదిలిపెట్టాడని సుమన్ టుర్ (70) చెప్పారు. తన తల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉండగా, డబ్బుకు విలువనిచ్చిన సిద్ధూ తమను వదిలేసి వెళ్ళిపోయాడని చెప్పారు. తమ తండ్రి మరణించిన తర్వాత తనను, తన తల్లిని సిద్ధూ గెంటేశాడన్నారు. తన తల్లి 1989లో ఓ రైల్వే స్టేషన్‌లో మరణించారని తెలిపారు. 


తమ తండ్రి ఓ ఇంటిని, కొంత భూమిని సంపాదించారని, ఆయనకు పింఛను కూడా వచ్చేదని చెప్పారు. సిద్ధూ సొమ్ము కోసం తాము ఆశించలేదని, ఆయన మాత్రం డబ్బు కోసం తమను వదిలిపెట్టాడని చెప్పారు. సిద్ధూ 1987లో ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ తల్లిదండ్రులు విడిపోవడం గురించి అబద్ధాలు చెప్పాడని ఆరోపించారు. తమ తల్లిదండ్రులు కోర్టు తీర్పు ద్వారా విడిపోయినట్లు సిద్ధూ చెప్పడంతో, ఆయనపై తన తల్లి కోర్టును ఆశ్రయించారని తెలిపారు. 


జనవరి 20న తాను సిద్ధూను కలవడానికి వెళ్ళినప్పటికీ, ఆయన తలుపు తీయలేదని చెప్పారు. ఆయనతో మాట్లాడేందుకు తాను చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవడంతో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశానని తెలిపారు. తన తల్లికి న్యాయం జరగాలని తాను కోరుకుంటున్నానన్నారు. డెబ్భయ్యేళ్ల వయసులో తన కుటుంబ విషయాలను బయటపెట్టడం తనకు చాలా బాధగా ఉందని చెప్పారు. 


పంజాబ్ శాసన సభ ఎన్నికలు ఫిబ్రవరి 20న జరుగుతాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించి, ముఖ్యమంత్రినవాలని సిద్ధూ కలలుగంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. 


Updated Date - 2022-01-28T21:32:53+05:30 IST