సిరువాణి జలాలను సక్రమంగా పంపిణీ చేయండి

ABN , First Publish Date - 2022-02-02T13:59:39+05:30 IST

సిరువాణి జలాశయం నుంచి కోయంబత్తూరు కార్పొరేషన్‌కు సమీప ప్రాంతాల్లోని ప్రజలకు సక్రమంగా జలాలను పంపిణీ చేయాలని కేరళ ముఖ్యమంత్రి పినరాయ్‌ విజయన్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ లేఖ రాశారు.

సిరువాణి జలాలను సక్రమంగా పంపిణీ చేయండి

                         - కేరళ సీఎంకు స్టాలిన్‌ లేఖ


చెన్నై: సిరువాణి జలాశయం నుంచి కోయంబత్తూరు కార్పొరేషన్‌కు సమీప ప్రాంతాల్లోని ప్రజలకు సక్రమంగా జలాలను పంపిణీ చేయాలని కేరళ ముఖ్యమంత్రి పినరాయ్‌ విజయన్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ లేఖ రాశారు. సిరువాణి జలాలలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం ప్రతియేటా జూలై ఒకటి నుంచి యేడాదిపాటు 1.30 టీఎంసీల నీటిని కేరళ ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉందని, దానితో కోవై కార్పొరేషన్‌ పరిధిలో ఉన్నవారికి, సమీప ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు మంచినీటిని తమ ప్రభుత్వం సరఫరా చేస్తోందని స్టాలిన్‌ పేర్కొన్నారు. అయితే గత కొన్నేళ్లుగా కేరళ ప్రభుత్వం నిర్ణీత పరిమాణం కంటే తక్కువగానే నీటిని విడుదల చేస్తోందని ఆరోపించారు. గత ఆరేళ్లుగా కేరళ ప్రభుత్వం సిరువాణి జలాశయం నుంచి 0.484 టీఎంసీల జలాలలను మాత్రమే విడుదల చేశారని గుర్తు చేశారు. సిరువాణి జలాశయం పరివాహక ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిసినా ఆ జలాశయంలో నీటి నిల్వకు కేరళ ప్రభుత్వం తగు చర్యలు చేపట్టడం లేదన్నారు. విషయమై కేరళ ఇరిగేషన్‌ అధికారులతో తమ రాష్ట్రానికి చెందిన అధికారులు పలుమార్లు చర్చలు జరిపినా ఫలితం లేకపోయిందన్నారు. ఈ పరిస్థితులలో ఒప్పందం ప్రకారం 1.30 టీఎంసీల జలాలను కోయం బత్తూరు కార్పొరేషన్‌, పరిసర ప్రాంతాలకు సరఫరా అయ్యేలా తక్షణ చర్యలు చేపట్టాలని స్టాలిన్‌ ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2022-02-02T13:59:39+05:30 IST