కరోనా గురించి 8 ఏళ్ల క్రితమే గుర్మిత్సింగ్ చెప్పాడట...
ABN , First Publish Date - 2020-04-05T16:39:19+05:30 IST
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ గురించి డేరా సచ్చా సౌదా వివాదాస్పద బోధకుడు గుర్మిత్ రాం రహీంసింగ్ 8 ఏళ్ల క్రితమే 2012లో వెల్లడించారా? అంటే అవునంటూ....
డేరా సచ్చాసౌదా అధికారిక వెబ్సైట్ కథనం
చండీఘడ్ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ గురించి డేరా సచ్చా సౌదా వివాదాస్పద బోధకుడు గుర్మిత్ రాం రహీంసింగ్ 8 ఏళ్ల క్రితమే 2012లో వెల్లడించారా? అంటే అవునంటూ సచ్ఛా సౌదా నిర్వాహకులు డేరా అధికారిక వెబ్ సైట్ లో ఓ కథనాన్ని పోస్టు చేశారు. ప్రపంచాన్ని వణికించే కరోనా బారి నుంచి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలి? అనే శీర్షికతో ఓ కథనాన్ని డేరా సైట్లో పోస్టు చేశారు. డేరా సచ్చాసౌదా చీఫ్ గుర్మిత్ సింగ్ ఇద్దరు సాధ్వీలను అత్యాచారం చేసిన కేసులో దోషిగా తేలడంతో పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు అతనికి 20 ఏళ్ల కారాగార శిక్ష విధించడంతో అతను హర్యానా రాష్ట్రంలోని రోహతక్ జిల్లా సునారియా జైలులో ఉన్నారు. డేరా చీఫ్ గుర్మిత్ సింగ్ రాసిన ఈ ఆర్టికల్ లో హ్యాండ్ శానిటైజేషన్ గురించి ప్రాధాన్యమిచ్చారు.
డేరాబాబా జైలు పాలు కావడంతో హర్యానాలో ఓ కమిటీ ఆధ్వర్యంలో సత్సంగ్ కార్యక్రమాలతో పాటు వెబ్ సైట్ నడుస్తోంది. వైరస్ సోకకుండా ప్రతీరోజూ చేతులను శుభ్రంగా కడుక్కోవాలని గుర్మిత్ సింగ్ అప్పట్లో చెప్పారని డేరా కమిటీ సభ్యులు చెబుతున్నారు. 2012లో హర్యానాలోని ఎస్ఎంజీ స్పోర్ట్సు కాంప్లెక్సులో నిర్వహించిన సమావేశంలో హ్యాండ్ శానిటైజేషన్ గురించి డేరాబాబా చెప్పారని ఆయన శిష్యులు చెబుతున్నారు. కరోనా వైరస్ సోకకుండా ఆవుపాలు తాగాలని కూడా గురూజీ సూచించారని ఆయన అనుచరులు చెపుతున్నారు. మొత్తంమీద జైల్లో శిక్ష అనుభవిస్తున్న గుర్మిత్ సింగ్ కరోనా గురించి 8ఏళ్ల క్రితమే హెచ్చరించాడని డేరా సభ్యులు చెప్పడం చర్చనీయాంశంగా మారింది.