విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

ABN , First Publish Date - 2022-06-30T05:17:24+05:30 IST

పేదలందరికి ఇళ్ల నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించకుండా విధి నిర్వహణల్లో నిర్లక్ష్యం వహించే మండల, జిల్లాస్థాయి అధికారులపై కఠిన చర్యలు చేపడతామని కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి హెచ్చరించారు.

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
సిరిపురం హౌసింగ్‌ లేఅవుట్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌

సరైన సమాచారం ఇవ్వని హౌసింగ్‌ ఏఈపై చర్యలకు ఆదేశం

హాజరు తక్కువగా ఉన్న ముగ్గురు వలంటీర్ల డిస్మిస్‌

సిరిపురం లేఅవుట్‌ తనిఖీలో కలెక్టర్‌ వేణుగోపాలరెడ్డి

గుంటూరు, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): పేదలందరికి ఇళ్ల నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించకుండా విధి నిర్వహణల్లో నిర్లక్ష్యం వహించే మండల, జిల్లాస్థాయి అధికారులపై కఠిన చర్యలు చేపడతామని కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి హెచ్చరించారు. బుధవారం మేడికొండూరు మండలంలోని సిరిపురం గ్రామంలో పేదలందరికి ఇళ్ల పథకం లేఅవుట్‌లో ఇళ్ల నిర్మాణాలు, గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలను కలెక్టర్‌ సందర్శించారు. సిరిపురం లేఅవుట్‌లో ఉన్న 291 ప్లాట్లలో గృహనిర్మాణాలు మంజూరు చేశామని, బీబీఎల్‌లో 181 ఉన్నాయని, బీఎల్‌లో 65, ఒకటి రూఫ్‌ లెవల్‌లో ఉన్నాయని హౌసింగ్‌ అధికారులు కలెక్టర్‌కి వివరించారు. లేఅవుట్‌లో మంజూరు చేసిన ఇళ్లకు హౌసింగ్‌ అధికారులు డీపీఆర్‌ పంపిన ఇళ్లకు వ్యత్యాసం ఉండటంపై ఆ శాఖ ఏఈ ప్రకాశరావుని కలెక్టర్‌ ప్రశ్నించగా ఆయన నుంచి సరైన సమాధానం రాలేదు. దాంతో కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏఈపై చర్యలు తీసుకోవాలని హౌసింగ్‌ పీడీని ఆదేశించారు. ఇళ్లనిర్మాణాలకు సంబంధించి లేఅవుట్‌లో ఉత్పన్నమయ్యే చిన్నపాటి సమస్యలను హౌసింగ్‌ అధికారులు, తహసీల్దార్‌, ఎంపీడీవోలను సమన్వయం చేసుకొంటూ పరిష్కరించుకోవాలని సూచించారు. జిల్లా స్థాయిలో పరిష్కరించాల్సిన విషయాలను వెంటనే తన దృష్టికి తీసుకురావాలన్నారు. లేఅవుట్‌లో అడ్డంగా ఉన్న 11 కేవీ హైటెన్షన్‌ వైర్లను వెంటనే పక్కకు మార్చాలని విద్యుత్‌ శాఖ అధికారులను ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన ఇసుక, ఇతర మెటీరియల్‌ని సకాలంలో సమకూర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. లేఅవుట్‌లోకి భవన నిర్మాణ సామాగ్రి వచ్చేలా అప్రోచ్‌ రోడ్లు గుంతలు లేకుండా చూసుకోవాలన్నారు. వర్షం నీరు లేఅవుట్లఓకి రాకుండా ఔట్‌ఫాల్‌ డ్రెయిన్ల ద్వారా నీరు వెళ్లేలా చూడాలన్నారు. సిరిపురం గ్రామ సచివాలయం-1ని కలెక్టర్‌ సందర్శించి సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితాలను పరిశీలించారు. క్లస్టర్ల వారీగా వలంటీర్లు లబ్ధిదారులతో రోజు మాట్లాడుతూ ఇళ్లు నిర్మించుకొనేలా ప్రోత్సహించాలన్నారు.  మేడికొండూరు గ్రామంలో రైతుభరోసా కేంద్రం-2 పరిధిలో 2,154 ఎకరాల సాగు భూమి ఉందని, దీనిలో 1,050 ఎకరాలకు సాగర్‌ కాలువల ద్వారా నీరు అందుతోందని, మిగిలిన ఎకరాల్లో బోర్‌వెల్స్‌, వర్షాధారంగా పంటలు సాగు చేస్తున్నారని కలెక్టర్‌కు అక్కడి అధికారులు నివేదించారు. ఆర్‌బీకే ద్వారా 100 ప్యాకెట్ల మిర్చి విత్తనాలు, 180 ప్యాకెట్ల పత్తి విత్తనాలు రైతులకు సరఫరా చేయడం జరిగిందన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ విత్తనాలను ప్రైవేటు దుకాణాల్లో ఎవరైనా అధిక ధరకు విక్రయిస్తుంటే చర్యలు తీసుకోవాలన్నారు. సచివాలయం-2లో అతితక్కువ బయోమెట్రిక్స్‌ హాజరు వేసిన ముగ్గురు వలంటీర్లని తొలగించాలని ఎంపీడీవోని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్‌ పీడీ సాయినాథ్‌కుమార్‌, తహసీల్దార్‌ కరుణకుమార్‌, ఎంపీడీవో శోభారాణి, హౌసింగ్‌ ఈఈ శంకరరావు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-30T05:17:24+05:30 IST