కష్టకాలంలో కోహ్లీనే అండగా ఉన్నాడు: సిరాజ్

ABN , First Publish Date - 2021-05-11T23:59:44+05:30 IST

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని యువ పేసర్ మహ్మద్ సిరాజ్‌ ఆకాశాన్నికెత్తేశాడు. తాను ఒత్తిడిలో చిక్కుకుని సతమతమవుతున్నప్పుడు కోహ్లీ ఎంతో అండగా..

కష్టకాలంలో కోహ్లీనే అండగా ఉన్నాడు: సిరాజ్

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని యువ పేసర్ మహ్మద్ సిరాజ్‌ ఆకాశాన్నికెత్తేశాడు. తాను ఒత్తిడిలో చిక్కుకుని సతమతమవుతున్నప్పుడు కోహ్లీ ఎంతో అండగా నిలిచాడని చెప్పుకొచ్చాడు. ఆసిస్ పర్యటన సమయంలో తాను తండ్రిని కోల్పోయిన ఆవేదనలో కూరుకుపోయి ఉన్నప్పుడు కోహ్లీనే తనకు కొండంత అండగా నిలిచాడని సిరాజ్ చెప్పాడు. తన కెరీర్లో తొలిసారిగా టీమిండియా తరపున జాతీయ టెస్టు జట్టులోకి అడుగుపెట్టినప్పుడు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని, ఆ సమయంలో కోహ్లీ తనకు ఎంతో ధైర్యం చెప్పాడని సిరాజ్ వెల్లడించాడు.


తన సామర్థ్యాన్ని కోహ్లీ ఎప్పుడూ ప్రశంసిస్తూ ఉంటాడని, తాను ఎలాంటి పిచ్‌పై అయినా బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్‌కు పంపగలనని కూడా కోహ్లీ అంటుంటాడని సిరీజ్ చెప్పాడు. ‘ఆసీస్ పర్యటనలోనే నేను నా తండ్రిని కోల్పోయాను. నా జీవితంలో తొలి సారి టీమిండియాకు ఆడుతున్నందుకు ఆనందపడాలో, తండ్రిని కోల్పోయినందుకు బాధపడాలో అర్థం కాలేదు. తీవ్ర ఒత్తిడితో కన్నీళ్లు పెట్టుకున్నా. మ్యాచ్ ఆడడం అటుంచితే కనీసం నా ఆలోచనలు కూడా నా ఆధీనంలో లేవు. అప్పుడే విరాట్‌ నా గదికి వచ్చాడు. నా పరిస్థితి చూసి వెంటనే నన్ను గట్టిగా కౌగిలించుకున్నాడు. నేను నీతో ఉన్నాను. ఆందోళన చెందకని ఓదార్చాడు. అతడిచ్చిన స్ఫూర్తితోనే మిగతా సిరీస్‌ మొత్తం ఆడాను. గొప్పగా రాణించాను. తొలి మ్యాచ్ అనంతరం కోహ్లీ భయ్యా ఇండియా వచ్చేసినా.. నాకు ఫోన్ చేస్తూ నాలో ధైర్యం నింపాడం’టూ సిరీజ్ చెప్పుకొచ్చాడు.


అంతేకాకుండా తన క్రికెట్‌ కెరీర్లోనే కాకుండా.. జీవితంలో కూడా కోహ్లీ తనకు ఎప్పుడూ అండగా ఉంటాడని, అందుకు నిజంగా తానెంతో అదృష్టవంతుడినని సిరాజ్ చెప్పుకొచ్చాడు. తన బౌలింగ్‌ను కోహ్లీ భయ్యా ప్రశంసిస్తుంటాడని, తన బౌలింగ్ ఎలాంటి పిచ్‌పై అయినా బ్యాట్స్‌మన్‌ను ఇబ్బంది పెట్టగలదని అంటుంటాడని సిరాజ్ చెప్పాడు. ఇక తాజాగా బౌలింగ్‌లో తాను చేసుకున్న మార్పులను కూడా ఎంతగానో అభినందించాడని సిరాజ్ వివరించాడు. కాగా.. తాజాగా ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికైన ఇండియా జట్టులో సిరీజ్ కూడా స్థానం దక్కించుకున్నాడు.

Updated Date - 2021-05-11T23:59:44+05:30 IST