జేకే-5ఓసీ నిర్వాసిత ఇళ్ల కూల్చివేతలో ఉద్రిక్త

ABN , First Publish Date - 2020-07-08T10:15:38+05:30 IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ఏరియా సింగరేణి జేకే-5ఓసీ నిర్వాసిత ప్రాంతమైన హమామలీబస్తీలోని సుమారు..

జేకే-5ఓసీ నిర్వాసిత ఇళ్ల కూల్చివేతలో ఉద్రిక్త

ఓ నిర్వాసితుడి ఆత్మహత్యాయత్నం


ఇల్లెందుటౌన్‌, జూలై 7: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ఏరియా సింగరేణి జేకే-5ఓసీ నిర్వాసిత ప్రాంతమైన హమామలీబస్తీలోని సుమారు 22 ఇళ్లను మంగళవారం సింగరేణి సెక్యూరిటీ, మునిసిపల్‌ సిబ్బంది; రెవెన్యూ, పోలీస్‌ అధికారుల పర్వవేక్షణలో కూల్చివేశారు.  ఇళ్లలోని వారిని బయటకు పంపి వారి సామగ్రిని సైతం బయటకు తరలించి ఎక్స్‌కవేటర్లు, డోజర్లతో ఇళ్లు కూల్చివేయడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సింగరేణికి చెందిన కాంట్రాక్టు వర్కర్లు, అవుట్‌సోర్సింగ్‌ వర్కర్లుతో పాటు ఇతరులు కలిసి ఇళ్లను కూల్చివేశారు. అయితే తమకు అతి తక్కువగానే పరిహరం ఇచ్చిన సింగరేణి అధికారులు తమ ఇళ్లను అక్రమంగా కూల్చివేయడం సరికాదని పలువురు మహిళలు కూల్చివేతను అడ్డుకున్నారు. పోలీసులు మహిళలను అడ్డు తొలగించారు. కూల్చివేతల సందర్భంగా హమాలీబస్తీకి చెందిన పలువురు పురుషులను ముందుగానే మంగళవారం తెల్లవారుజామున పోలీసులు అదుపులోకి తీసుకున్న అనంతరమే కూల్చివేతలు ప్రారంభించారని నిర్వాసితులు ఆరోపించారు. తమకు సమాచారం ఇవ్వకుండా కూల్చివేడం సరికాదన్నారు.


సింగరేణి యజమాన్యం తమకు ఇళ్ల స్థలాలతో పాటు పరిహరం ఇచ్చినప్పటీకీ అవి సరిపోని స్థితిలోనే రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించామని నిర్వాసితులు పేర్కొన్నారు. కరోనా సమయంలో తమకు ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. చిన్న పిల్లలతో ఉన్న తాము ఎక్కడ తలదాచుకోవాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్ల కూల్చివేతతో తమ బతుకులు వీధినపడినట్లయ్యిందని, మానవతా దృక్పదంతోనైనా తమకు సింగరేణి క్వార్టర్లను తాత్కలికంగానైనా కేటాయించాలని నిర్వాసితులు కోరారు. 


నిర్వాసితుడి ఆత్మహత్యాయత్నం

తమకు తలదాచుకునేందుకు ఇల్లు లేకుండా చేశారు. తీవ్ర మనస్థాపానికి గురైన గాదె లక్ష్మన్‌ అనే వికలాంగ నిర్వాసితుడు మంగళవారం మద్యాహ్నం ఆత్మహత్యాయత్నం చేశారు. ఇంట్లో ఉన్న గుళికలను మింగడంతో గమనించిన కుటుంబసభ్యులు వెంటనే అతడిని సింగరేణి అంబులెన్స్‌ ద్వారా ఇల్లెందు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. 

Updated Date - 2020-07-08T10:15:38+05:30 IST