సింగరేణికి డిస్కమ్ల బాకీ రూ.3,020 కోట్లు
ABN , First Publish Date - 2020-02-22T08:34:51+05:30 IST
సింగరేణికి తెలంగాణ డిస్కమ్లు రూ.3,020 కోట్లు బాకీ పడ్డాయి. మంచిర్యాలలో 1200 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ నుంచి విద్యుత్ను ఉత్పత్తి చేసి...
హైదరాబాద్, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): సింగరేణికి తెలంగాణ డిస్కమ్లు రూ.3,020 కోట్లు బాకీ పడ్డాయి. మంచిర్యాలలో 1200 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ నుంచి విద్యుత్ను ఉత్పత్తి చేసి... డిస్కమ్లకు సింగరేణి అమ్ముతోంది. యూనిట్కు ధర కూడా అతి తక్కువగా రూ.3.42లకు విక్రయిస్తుండటం గమనార్హం. 2016-17లో రూ.1,258 కోట్లను బిల్లుగా డిస్కమ్లకు పంపించగా... ఆ ఏడాది చెల్లించిన బిల్లులు రూ.352.88 కోట్లే. 2017-18లో రూ.3,596.50 కోట్ల బిల్లు పంపించగా... రూ.2,738 కోట్లు మాత్రమే సింగరేణికి వచ్చాయి. ఆ తర్వాత 2018-19 (ఫిబ్రవరి దాకా) రూ.3,084 కోట్ల బిల్లు పంపిస్తే రూ.1831.95 కోట్లు మాత్రమే చెల్లించారు. 2019 ఫిబ్రవరి దాకా రూ.7,938 కోట్ల బిల్లు పంపించగా... రూ.4,923 కోట్లు కనాకష్టంగా చేరాయి. గతేడాది ఫిబ్రవరి నాటికి రూ.3,020 కోట్లు విద్యుత్ సంస్థలు సింగరేణికి బాకీ ఉండగా... ఏడాది కాలంలో చెల్లింపులు దాదాపుగా నిలిచిపోయాయి. దీంతో ఈ బకాయిలు రూ.4000 కోట్లకు చేరినట్లు సమాచారం.