బొగ్గుగని కార్మికులను స్వేచ్ఛగా బతకనివ్వండి
ABN , First Publish Date - 2020-11-28T04:33:08+05:30 IST
కొత్తగూడెంలో నివసిస్తున్న సింగరేణి బొగ్గుగని కార్మికులను స్వేచ్ఛగా, మనశ్శాంతిగా బతకనివ్వాలని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కోరారు.
సమస్య ఏమున్నా ముఖ్యమంత్రితో మాట్లాడి పరిష్కరిస్తా: ఎమ్మెల్యే వనమా
రుద్రంపూర్ (సింగరేణి), నవంబరు 27: కొత్తగూడెంలో నివసిస్తున్న సింగరేణి బొగ్గుగని కార్మికులను స్వేచ్ఛగా, మనశ్శాంతిగా బతకనివ్వాలని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కోరారు. వారి నుంచి ఏదైనా సమస్య ఉంటే నేను ముఖ్యమంత్రి కేసీఆర్తో మాట్లాడతానని భరోసా నిచ్చారు. సింగరేణి యాజమాన్యం కార్మికులను, వారి కుటుంబ సభ్యులను ఎలాంటి వేధింపు లకు గురి చేసినా సహించేదిలేదని హెచ్చరించారు. కొత్తగూడెం సింగరేణి మైన్స్ ఏరియా యాజమాన్యం వారు ఇదే గౌతంఖని ఓపెన్ కాస్ట్ (జీకేఓసీ) విస్తరణపై రుద్రంపూర్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ ఆవరణలో శుక్రవారం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం లో ఎమ్మెల్యే వనమా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇక్కడి మెజార్టీ ప్రజలు ఏం కోరుకుంటారో అదే చేయాలని సూచించారు. ఈ మధ్య కాలంలో సింగరేణిలో 40 ఏళ్లపాటు ఉద్యోగం చేసి దిగిపోయిన కార్మికులు ఇల్లు కట్టుకుంటే కూలగొట్టిన సంఘటన ఆయన గుర్తుచేశారు. బొగ్గుగని కార్మికులను దోషుల్లా.... దొంగల్లా చూసే ధోరణిని మార్చుకోవాలని కోరారు. అవసరమైతే ముఖ్యమంత్రి కేసీఆర్తో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తానని హామీనిచ్చారు.
ప్రభావిత ప్రాంతాలను అభివృద్ధి చేయండి: పులి గీత
కొత్తగూడెం మైన్స్ ఏరియా ప్రభావిత ప్రాంతాల్లో రామవరం పట్టణం ఒకటి. అందులో మునిసిపాలిటీ వార్డులు ఉన్నాయి. దీన్ని అభివృద్ధి చేసే దిశగా ఇక్కడి యాజమాన్యం కృషి చేయాలని మునిసిపల్ చైర్పర్సన్ పులి గీత కోరారు. ఈ విషయాన్ని జనరల్ మేనేజర్ సీహెచ్. నరసింహారావు దృష్టికి పలుమార్లు తీసుకెళ్లామని అన్నారు. రామచంద్ర డిగ్రీ కళాశా ల ఖాళీ స్థలంలో రామవరం ప్రజల సౌకర్యార్ధం వాకింగ్ ట్రాక్ నిర్మించాలని కోరారు. ఇక్కడి పారిశుధ్యం పనుల నిర్వహణకు సింగరేణి పక్షం నుంచి మరో ట్రాక్టర్ను ఏర్పాటు చేయాలని సూచించారు.
కార్మికుల సంక్షేమం కూడా చూడాల్సిందే: సాబీర్ పాషా
సింగరేణి యాజమాన్యం బొగ్గు ఉత్పత్తిపైనే కాకుండా కార్మికుల సంక్షేమంపై కూడా దృష్టిసారించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే. సాబీర్ పాషా డిమాండ్ చేశారు. కొత్తగూడెం సింగరేణి యాజమాన్యం ఇక్కడి రైతులను భూనిర్వాసితులుగా మారుస్తోందని ఆరోపించారు. ప్రభావిత ప్రాంతాల బాధ్యత యాజమాన్యమే తీసుకోవాలని కోరారు. ఇక్కడి విద్యావంతులైన యువతకు ఉపాధి చూపించే దిశగా ఆలోచన చేయాలని అభిప్రాయపడ్డారు. కార్మికుల సమస్యలపై యాజమాన్యం స్పందించాలని కోరారు. వారికి ఏ సమస్యలున్నా పరిష్కరించే బాఽ ద్యత యాజమాన్యానిదేనని అన్నారు. వారి సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని కోరారు. కార్మికుల సంక్షేమమే ప్రథమ కర్తవ్యమని అన్నారు. అదనపు కలెక్టర్ కె.వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పర్యావరణ విభాగం ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ రవిశంకర్, ఏరియా జనరల్ మేనేజర్ సీహెచ్. నరసింహారావు, జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వనమా రాఘవేంద్రరావు, ఏరియా టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు రుద్రంపూర్ రజాక్, వివిధ మండలాల అధ్యక్షులు మునిసి పల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా టూ టౌన్ సీఐ బి. సత్యనారాయణ, చుంచుపల్లి సీఐ గురుస్వామి, ఎస్ఐలు చల్లా అరుణ, రాంబాబు బందోబస్తును పర్యవేక్షించారు.