సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి వేడుకలు

ABN , First Publish Date - 2021-10-27T20:15:45+05:30 IST

సింగపూర్ తెలుగు సమాజం, తిరుమల తిరుపతి దేవస్థానము, శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాల తెలుగు విభాగము, మలేషియా తెలుగు సంఘము సంయుక్త ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.

సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి వేడుకలు

సింగపూర్ సిటీ: సింగపూర్ తెలుగు సమాజం, తిరుమల తిరుపతి దేవస్థానము, శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాల తెలుగు విభాగము, మలేషియా తెలుగు సంఘము సంయుక్త ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సుందరకాండ నవగ్రహ అనుగ్రహ దీక్ష అనే అంశంపై అక్టోబర్ 20న అంతర్జాతీయ అంతర్జాల సదస్సు నిర్వహించారు. కొంతమంది జీవితంలో నవగ్రహ దోషాల వలన బాధపడుతూ ఉంటారు. ఆ దోష నివారణకు వాల్మీకి రామాయణ ఉపాసకులు శ్రీ రామాయణ హరినాథ రెడ్డి, ఇండోనేషియా వారిచే సుందరకాండ నవగ్రహ అనుగ్రహ దీక్ష అనే  అంశంపై ఉపన్యసించి, దీక్ష నియమాలను పాటించిన వారికి నవగ్రహాల అనుగ్రహం తోపాటు సీతారాముల కటాక్షము కలుగుతుందని తెలిపారు. తద్వారా గ్రహ దోషాలు ఉపశమించి సిరి సంపదలు, సంతోషం సంప్రాప్తిస్తాయన్నారు.


సమాజ శ్రేయస్సు కొరకు ఉచితంగా నిర్వహించిన ఈ దీక్ష కార్యక్రమానికి టీటీడీ ఛైర్మెన్ వై.వి.సుబ్బారెడ్డి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. వాల్మీకి రామాయణం మానవాళికి మార్గనిర్దేశనం అని, త్రేతాయుగం నాటి రామాయణాన్ని నేడు ప్రతి ఒక్కరూ అనుసరించేలా మహర్షి వాల్మీకి రచించారని తెలిపారు. విశిష్టఅతిధిగా హాజరైన ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ రామాయణమే మానవ జీవన పారాయణమని పేర్కొన్నారు. భారతీయ సనాతధర్మ వారధి, హైందవ సంస్కృతీ పరిరక్షణ సారథి వాల్మీకి మహర్షి అని తెలియజేశారన్నారు. సమాజ శ్రేయస్సు కోసం చేపడుతున్న సదస్సుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం తరపున అభినందనలు తెలియజేశారు. సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటి రెడ్డి అందరికీ వాల్మీకీ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. బలమైన కుటుంబ వ్యవస్థకు రామాయణం తార్కాణం అని, ఇలాంటి భక్తి సంబంధ కార్యక్రమాల ద్వారా అందరిలో ఆధ్యాత్మిక చింతన పెరుగుతుందన్నారు.


ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి అంతర్జాతీయ ప్రశంసా పత్రాన్ని అందిస్తామని తెలియజేశారు. జూమ్ ద్వారా నిర్వహించిన ఈ సదస్సులో సుమారు 20 దేశాల నుండి ప్రవాసులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్, ఫేస్‌బుక్ ద్వారా 2000 మందికి పైగా వీక్షించారని కార్యక్రమ నిర్వాహకులు, సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షులు జ్యోతీశ్వర్ రెడ్డి తెలిపారు. సభాద్యక్షులుగా డా. మహదేవమ్మ, పర్యవేక్షకులుగా డా. కృష్ణవేణి వ్యవహరించి సదస్సునుద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మలేషియా తెలుగు సంఘము అధ్యక్షులు డా. వెంకట ప్రతాప్, ఉపాధ్యక్షులు సూర్య నారాయణ, మేడూరి మాధవకృష్ణ శర్మ(అమెరికా), మల్లికేశ్వరరావు(ఆస్ట్రేలియా) మెుదలగు వారు పాల్గొన్నారు. సదస్సులో పాల్గొన్న అతిథులకు, వక్తలకు, వీక్షకులకు, కార్యవర్గ సభ్యులకు సింగపూర్ తెలుగు సమాజం కార్యదర్శి సత్య చిర్ల ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.   

Updated Date - 2021-10-27T20:15:45+05:30 IST