శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ ఆధ్వర్యంలో గాన గంధర్వునికి ఘననివాళి

ABN , First Publish Date - 2020-10-19T01:16:37+05:30 IST

“శ్రీ సాంస్కృతిక కళాసారథి” సింగపూర్ వారి ఆధ్వర్యంలో తెలుగువారి అభిమాన గాయకులు పద్మభూషణ్ ఎస్.పీ బాలసుబ్రమణ్యం సంస్మరణలో “గాన గంధర్వునికి ఘననివాళి” కార్యక్రమం అంతర్జాలం వేదికగా జరిగింది. భారత్ నుండి పలువురు సినీ ప్రముఖులు, సింగపూర్‌లోని బాలు అభిమానులు.. గాన గంధర్వుడి పాట

శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ ఆధ్వర్యంలో గాన గంధర్వునికి ఘననివాళి

సింగపూర్: “శ్రీ సాంస్కృతిక కళాసారథి” సింగపూర్ వారి ఆధ్వర్యంలో తెలుగువారి అభిమాన గాయకులు పద్మభూషణ్ ఎస్.పీ బాలసుబ్రమణ్యం సంస్మరణలో “గాన గంధర్వునికి ఘననివాళి” కార్యక్రమం అంతర్జాలం వేదికగా జరిగింది. భారత్ నుండి పలువురు సినీ ప్రముఖులు, సింగపూర్‌లోని బాలు అభిమానులు.. గాన గంధర్వుడి పాటలను, వారి మాటలను, ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని తలచుకున్నారు. ఎస్పీబీతో వారు పెంచుకున్న అభిమానాన్ని, పంచుకున్న అనుబంధాన్ని గురించి మాట్లాడుతూ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నేపథ్య గాయని గిన్నిస్ బుక్ రికార్డ్ విజేత, గానకోకిల పీ.సుశీల మాట్లాడుతూ… ఎప్పీబీతో కలిసి తాను ఎన్నో వేల పాటలు పాడానని బాలు లేని లోటు సినీ ప్రపంచానికి తీరదని అన్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ.. తాను 400కు పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాను అంటే కారణం బాలు వంటి అద్భుత గాయకులు ఉండడం వల్లనే సాధ్యమైంది అన్నారు.



సీనియర్ చలనచిత్ర ఛాయాగ్రహకులు ఎస్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. బాలు గారు నటించిన ‘పక్కింటి అమ్మాయి’ వంటి చిత్రాలకు తాను ఛాయాగ్రహకులుగా పని చేశానని తెలిపి, వారి అనుబంధాన్ని తలచుకున్నారు. ప్రముఖ నేపథ్య గాయకులు మనో.. గాన గంధర్వుడి పాటలను పాడి అందరిని మైమరపింపజేశారు. బాలు వంటి గాయకులు మరణానికి అతీతులని వారి పాటలతో ప్రేక్షకులందరి మనసులలో ఎన్నటికీ చిరంజీవిగా ఉంటారని ప్రముఖ సినీ గేయరచయిత భువనచంద్ర అన్నారు. మ్యూజికాలజిస్ట్ రాజా మాట్లాడుతూ.. బాలు తన వ్యక్తిగత జీవితంలో ఎంత సరదాగా అందరితో కలసి నవ్వుతూ, నవ్విస్తూ ఉండేవారని చెప్పారు. ఎస్పీబీకి రఫీ పాటలపై ఉన్న ప్రత్యేక అభిమానాన్ని గురించి వెల్లడించారు. అమెరికా నుంచి వంగూరి చిట్టెన్ రాజు మాట్లాడుతూ.. బాలు అమెరికా పర్యటనలో వారి ఇంట్లో ఆతిథ్యాన్ని స్వీకరించి తమ కుటుంబ సభ్యులలో ఒకరిగా కలిసిపోయిన వైనాన్ని తలచుకున్నారు.



ప్రముఖ సినీ నటులు హర్షవర్ధన్.. బాలుపై తన మనసులో ఉన్న ఎనలేని అభిమానాన్ని వెల్లడించారు. ఒక టీవీ ధారావాహిక కోసం తాను రచించిన పాటను ఎస్పీబీ పాడారని తెలిపారు. అది తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. బాలు చేసినటువంటి సాంఘిక సేవా కార్యక్రమాలను గూర్చి వంశీ రామరాజు వివరిస్తూ ఆయనను కొనియాడారు. అంతేకాకుండా.. బాలుకు భారతరత్న ఇవ్వాలని, అందుకోసం ప్రపంచ వ్యాప్తంగా వున్నా బాలు అభిమానులు ప్రయత్నించాలని ఆకాంక్షించారు. ప్రముఖ గాయని సంధ్య జయకృష్ణ చక్కని పాటలను వినిపించడమే కాకుండా, ఈ కార్యక్రమంలోనికి సుశీలమ్మ గారిని తీసుకువచ్చి.. బాలుతో ఆమెకున్న అనుబంధాన్ని పంచుకునేటట్లుగా చేయడంతో నిర్వాహకులు సంధ్య జయకృష్ణ‌కు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.


అమెరికా నుంచి ఆధ్యాత్మికవేత్త మధు ప్రాఖ్య కూడా తన అనుభవాలను పంచుకున్నారు. కవితాపూర్వక నివాళులర్పించారు. సింగపూర్ నుంచి విశ్వాత్ముల రవి పాల్గొని.. బాలు పాటలను ఆలపించగా.. సుబ్బు వి పాలకుర్తి కవితా గానం చేశారు. పద్మజా నాయుడు, రవి కిరణ్, రాపోలు నందు, కార్యక్రమం ముఖ్య నిర్వాహకులు రత్న కుమార్.. ఎస్పీబీతో తమకు ఉన్న అనుభవాలను తెలియజేశారు. అలాగే ముత్యాలముగ్గు నిర్మాత ఎమ్‌వీఎల్‌తో, నూజివీడుకు ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని పంచుకున్నారు. ఎమ్‌వీఎల్‌ కూతురు అనురాధ.. గాన గంధర్వుడితో వారి నాన్నకు ఉన్న అనుబంధాన్ని ఆడియో రూపంలో పంచుకున్నారు.



రాధిక మంగిపూడి వ్యాఖ్యాతగా సమన్వయపరుస్తూ కార్యక్రమం నిర్వహించారు. గణేశ్న రాధాకృష్ణ ముఖ్య సాంకేతిక నిర్వాహకులుగా, రామాంజనేయులు, సుధాకర్ సాంకేతిక సహాయకులుగా కార్యక్రమాన్ని నిరాటంకంగా నడిపించారు. ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ అధ్యక్షులు రత్న కుమార్ మాట్లాడుతూ.. “బాలు పాటకు మరణం లేదు. వారు ఎప్పటికీ సజీవులే. ఇది ఒక సంతాపసభ వలే కాకుండా బాలు పాటకు, వ్యక్తిత్వానికి పట్టం కడుతూ వారి సంస్మరణలో ఒక సాయంకాలం వారికి నివాళులు అర్పించడానికి ఈ కార్యక్రమం నిర్వహించాము. మా కోర్కె మన్నించి బాలుపై అభిమానంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుశీల, కోటి, మనో , భువనచంద్ర వంటి ప్రముఖులకు అందరికీ మా ప్రత్యేక కృతజ్ఞతలు” అని తెలియజేశారు.

Updated Date - 2020-10-19T01:16:37+05:30 IST