గాలి నుంచి నీరు !
ABN , First Publish Date - 2021-01-24T08:28:12+05:30 IST
ఓ అసాధ్యాన్ని సుసాధ్యం చేసే దిశగా నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్(ఎస్యూఎస్) శాస్త్రవేత్తలు కీలక ముం దడుగు వేశారు. గాలి నుంచి స్వచ్ఛమైన నీటిని ఒడిసిపట్టేందుకు వారు జరుపుతున్న పరిశోధనలు...
- 1కేజీ ఏరోజెల్తో 17 లీటర్ల తాగునీరు
- సింగపూర్ శాస్త్రవేత్తల ఘనత
సింగపూర్ సిటీ, జనవరి 23: ఓ అసాధ్యాన్ని సుసాధ్యం చేసే దిశగా నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్(ఎస్యూఎస్) శాస్త్రవేత్తలు కీలక ముం దడుగు వేశారు. గాలి నుంచి స్వచ్ఛమైన నీటిని ఒడిసిపట్టేందుకు వారు జరుపుతున్న పరిశోధనలు సఫలమయ్యాయి. ఇంధన వనరులను వాడాల్సిన అవసరం లేకుండా, చిన్నపాటి సహజ మార్పుల ఊతం తో గాలి నుంచి శుద్ధమైన జలాన్ని సేకరించే పద్ధతిని అభివృద్ధి చేసినట్లు పరిశోధకులు వెల్లడించారు. ఇందుకోసం అత్యంత తేలికగా ఉండే ఏరోజెల్ను తయారు చేశామని, అది ఓ స్పాంజిలా పనిచేస్తుందని తెలిపారు. ఏరోజెల్ పనిచేయడానికి బ్యాటరీ అవసరం లేదన్నారు. స్పాంజి లాంటి స్వభావం కలిగిన ఈ ఏరోజెల్ గాల్లోని నీటి అణువులను తనలోకి పీల్చుకుంటుంది. అనంతరం అందులోని పాలిమర్లు సంకోచ, వ్యాకోచాలు జరిపి.. లోపలికి చేరిన నీటి అణువులను ద్రవరూపంలోబయటికి నెట్టేస్తాయి. దాన్ని ట్యాంకుల్లో నింపుకొని తాగునీటి అవసరాలు తీర్చుకోవచ్చు. సగటున 1 కేజీ ఏరోజెల్ను ఉపయోగించి గాలి నుంచి 17 లీటర్ల నీటిని ఉత్పత్తి చేయొచ్చని ఎన్యూఎస్ శాస్త్రవేత్త హో ఘిమ్ చెప్పారు.