Singapore: 2నెలల వ్యవధిలో ఇద్దరు భారత సంతతి వ్యక్తుల ఉరితీత.. ఇద్దరిదీ ఒకే కథ!

ABN , First Publish Date - 2022-07-08T18:22:48+05:30 IST

డ్రగ్ కేసులో పట్టుబడి పదేళ్లు జైలు జీవితం గడిపిన భారత సంతతి వ్యక్తి మలేసియాకు చెందిన నాగేంద్రన్ ధర్మలింగం(34)ను సింగపూర్ అధికారులు ఈ ఏడాది ఏప్రిల్‌లో ఉరి తీసిన విషయం తెలిసిందే.

Singapore: 2నెలల వ్యవధిలో ఇద్దరు భారత సంతతి వ్యక్తుల ఉరితీత.. ఇద్దరిదీ ఒకే కథ!

సింగపూర్ సిటీ: డ్రగ్ కేసులో పట్టుబడి పదేళ్లు జైలు జీవితం గడిపిన భారత సంతతి వ్యక్తి మలేసియాకు చెందిన నాగేంద్రన్ ధర్మలింగం(34)ను సింగపూర్ అధికారులు ఈ ఏడాది ఏప్రిల్‌లో ఉరి తీసిన విషయం తెలిసిందే. ఇప్పుడు రెండు నెలల వ్యవధిలోనే గురువారం మరో భారతీయ వ్యక్తిని సింగపూర్ ఉరి తీసింది. కల్వంత్ సింగ్ అనే మలేషియాకు చెందిన భారత సంతతి వ్యక్తిని కూడా డ్రగ్స్ కేసులోనే మరణ శిక్షను అమలు చేసింది. ఇలా రెండు నెలల వ్యవధిలోనే ఇద్దరు భారత సంతతి వ్యక్తులు ఒకే కారణంతో ఉరి తీయబడ్డారు. ఇక కుల్వంత్ ఉరి నుంచి తప్పించుకునేందు చివరి వరకు పోరాడాడు. కానీ, కుదరలేదు. అతని చివరి అర్జీని కూడా న్యాయస్థానం కొట్టేసింది. దీంతో గురువారం సింగపూర్ అధికారులు అతనికి మరణ శిక్షను అమలు చేశారు.


పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మలేషియాకు చెందిన కుల్వంత్ సింగ్ 2013లో 60.15 గ్రాముల డైమార్ఫిన్ (హెరాయిన్)తో పాటు మరో 120.9 గ్రాముల ఇతర మాదకద్రవ్యాలు తరలిస్తూ సింగపూర్ అధికారులకు పట్టుబడ్డాడు. దీంతో 2016లో సింగపూర్ న్యాయస్థానం అతడిని దోషిగా తేల్చి, ఉరి శిక్ష విధించింది. అప్పటి నుంచి సింగపూర్ జైలులోనే ఉన్నాడు. ఈ క్రమంలో గత నెల 30న కుల్వంత్‌ను జూలై 7న మరణశిక్షను అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో కుల్వంత్ తన ఉరిశిక్షను రద్దు చేయాలంటూ సింగపూర్ న్యాయస్థానంలో మరోసారి అర్జీ పెట్టుకున్నాడు. కానీ, న్యాయస్థానం అతడి పిటీషన్‌ను తోసిపుచ్చింది. అటు ఈ విషయం తెలుసుకున్న మానవ హక్కుల కార్యకర్తలు కౌలాలంపూర్‌లోని సింగపూర్ హైకమిషన్ కార్యాలయం ముందు కూడా కుల్వంత్ ఉరిశిక్షను రద్దు చేయాలంటూ బుధవారం కొవ్వొత్తి నిరసన తెలిపారు. ముందు చెప్పినట్టుగానే అధికారులు గురువారం కుల్వంత్‌ను ఉరి తీశారు. ఈ విషయాన్ని సింగపూర్ మానవ హక్కుల కార్యకర్త కిర్‌స్టెన్ హన్ ధృవీకరించారు.         


Updated Date - 2022-07-08T18:22:48+05:30 IST