సింధు, శ్రీకాంత్‌ శుభారంభం

ABN , First Publish Date - 2021-12-02T08:20:14+05:30 IST

బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌టూర్‌ ఫైనల్స్‌లో భారత ఏస్‌ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌ శుభారంభం చేయగా.. యువ ఆటగాడు లక్ష్యసేన్‌కు అదృష్టం కలసి వచ్చింది.

సింధు,  శ్రీకాంత్‌  శుభారంభం

వరల్డ్‌టూర్‌ ఫైనల్స్‌

బాలి: బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌టూర్‌ ఫైనల్స్‌లో భారత ఏస్‌ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌ శుభారంభం చేయగా.. యువ ఆటగాడు లక్ష్యసేన్‌కు అదృష్టం కలసి వచ్చింది. కాగా, డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌, అశ్వినీ జోడీలు పరాజయంతో టోర్నీని ఆరంభించాయి. మహిళల సింగిల్స్‌ గ్రూప్‌-ఎలో బుధవారం జరిగిన తన తొలి మ్యాచ్‌లో ఒలింపిక్‌ పతక విజేత సింధు 21-14, 21-16తో లైన్‌ క్రిస్టోఫర్సెన్‌ (డెన్మార్క్‌)ను చిత్తు చేసింది. తర్వాతి మ్యాచ్‌లో జర్మనీ ప్లేయర్‌ యవన్నీలీతో సింధు తలపడనుంది. పురుషుల సింగిల్స్‌ గ్రూప్‌-బిలో శ్రీకాంత్‌ 21-14, 21-16తో టోమా పొపోవ్‌ (ఫ్రాన్స్‌)పై నెగ్గాడు.


అయితే, గ్రూప్‌-ఎలో లక్ష్యసేన్‌తో మ్యాచ్‌లో 1-1తో ఉన్నప్పుడు జపాన్‌ స్టార్‌ కెంటో మొమోటా గాయం కారణంగా రిటైరయ్యాడు. తర్వాతి మ్యాచ్‌లో టాప్‌సీడ్‌ అక్సెల్‌సెన్‌తో సేన్‌ తలపడనున్నాడు. మహిళల డబుల్స్‌ గ్రూప్‌-బిలో అశ్విని-సిక్కిరెడ్డి జోడీ 14-21, 18-21తో జపాన్‌ జంట నమి మట్సుయామా-చిహారు షిదా చేతిలో, పురుషుల డబుల్స్‌ గ్రూప్‌-ఎలో సాత్విక్‌-చిరాగ్‌ షెట్టి ద్వయం 16-21, 5-21తో డెన్మార్క్‌ జోడీ ఆస్ట్ర్‌ప-ఆండ్రెస్‌ చేతిలో పరాజయం పాలయ్యారు. 

Updated Date - 2021-12-02T08:20:14+05:30 IST