క్వార్టర్స్‌లో సింధు

ABN , First Publish Date - 2022-05-20T10:12:41+05:30 IST

రెండుసార్లు ఒలింపిక్‌ పతక విజేత పీవీ సింధు థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకుపోయింది.

క్వార్టర్స్‌లో  సింధు

వైదొలగిన శ్రీకాంత్‌

థాయ్‌లాండ్‌ ఓపెన్‌

బ్యాంకాక్‌: రెండుసార్లు ఒలింపిక్‌ పతక విజేత పీవీ సింధు థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకుపోయింది. అయితే పురుషుల సింగిల్స్‌లో..స్టార్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ రెండోరౌండ్‌నుంచి అనూహ్యంగా వైదొలిగాడు. ఫలితంగా ఈ టోర్నమెంట్‌లో భారత్‌ తరపున సింధు మాత్రమే మిగిలింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో ప్రపంచ ఏడో ర్యాంకర్‌ సింధు 21-16, 21-13తో సిమ్‌ యు జిన్‌ (కొరియా)పై సునాయాసంగా నెగ్గింది. తదుపరి రౌండ్‌లో రెండో సీడ్‌ అకానె యమగూచితో సింధు అమీతుమీ తేల్చుకోనుంది.


భారత జట్టు థామస్‌ కప్‌ స్వర్ణం సాధించడంలో కీలక భూమిక పోషించిన శ్రీకాంత్‌..ఎంగ్యుయెన్‌ (ఐర్లాండ్‌)తో రెండో రౌండ్‌లో తలపడాల్సి ఉంది. కానీ ఎనిమిదో సీడ్‌ కిడాంబి..ప్రత్యర్థికి వాకోవర్‌ ఇచ్చాడు. అయితే టోర్నీ నుంచి తప్పుకోవడానికి గల కారణాలను మాత్రం శ్రీకాంత్‌ వెల్లడించలేదు. మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో మాళవికా బన్సోడ్‌ 21-16, 14-21, 14-21తో లినె క్రిస్టోఫర్‌సన్‌ (డెన్మార్క్‌) చేతిలో పోరాడి ఓడింది. హోరాహోరీగా జరిగిన మిక్స్‌డ్‌ రెండో రౌండ్‌లో ఇషాన్‌ భట్నాగర్‌, తనీషా క్రాస్టో ద్వయం 19-21, 20-22తో ఆరో సీడ్‌ మలేసియా జోడీ గో హౌట్‌, షెవాన్‌ చేతిలో పరాజయం చవిచూసింది. 

Updated Date - 2022-05-20T10:12:41+05:30 IST