కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏకకాలంలో రూ.2 లక్షల రైతు రుణమాఫీ
ABN , First Publish Date - 2022-05-18T05:30:00+05:30 IST
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏకకాలంలో రూ.2 లక్షల రైతు రుణమాఫీ
- టీపీసీసీ ఉపాధ్యక్షుడు ఎం.రమేష్
బషీరాబాద్, మే 18 : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీతో పాటు మరెన్నో రైతు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టనున్నట్లు టీపీసీసీ ఉపాధ్యక్షుడు ఎం.రమేష్ అన్నారు. బుధవారం మన ఊరు-మన కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా బషీరాబాద్ మండలం కంసాన్పల్లి(బి), మైల్వార్, మర్పల్లి, నవాల్గ, భోజ్యానాయక్తండాలలో విస్తృతంగా పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అంతకుముందు నీళ్లపల్లి ఏకాంబర రామలింగేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఆయా గ్రామ సభలో ప్రజలెదుర్కుంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని స్వయంగా నోట్ చేసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు చేసిందేమీ లేదన్నారు. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ, భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు ఏడాదికి ఎకరాకు రూ.15 వేలను ఇందిరమ్మ రైతు భరోసా పథకం కింద అందించనున్నామన్నారు. ఈసారి ఎన్నికల్లో తాండూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీలో తానే ఉంటానని ఎలాంటి అనుమానం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ బషీరాబాద్ మండలాధ్యక్షులు శంకరప్ప, సీనియర్ నాయకులు ఉత్తంచంద్, జనార్ధన్రెడ్డి, ధరసింగ్, నర్సింహరెడ్డి, అనిల్కుమార్గౌడ్, అలీం, నర్సింహులు తదితరులున్నారు.