ఒక్కరోజే రూ.3800 పెరిగిన వెండి
ABN , First Publish Date - 2022-10-05T09:32:18+05:30 IST
పండగ వేళ దేశంలో విలువైన లోహాల ధర లు కొండెక్కాయి. ఢిల్లీ మార్కెట్లో మేలిమి బంగారం (24 క్యారెట్లు) తులానికి రూ.980 పెరిగి రూ.51,718కి చేరుకుంది.
బంగారానిదీ అదే జోరు
ఢిల్లీలో తులం బంగారం రూ.980 వృద్ధి
న్యూఢిల్లీ: పండగ వేళ దేశంలో విలువైన లోహాల ధర లు కొండెక్కాయి. ఢిల్లీ మార్కెట్లో మేలిమి బంగారం (24 క్యారెట్లు) తులానికి రూ.980 పెరిగి రూ.51,718కి చేరుకుంది. కిలో వెండి ఏకంగా రూ.3,790 మేర ఎగబాకి రూ.61,997 ధర పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో వీటి ధరలు ఒక్కసారిగా పెరగడమే ఇందుకు కారణమని బులియన్ మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఇంటర్నేషనల్ కమోడిటీ మార్కెట్లో ఔన్స్ (31.10 గ్రాములు) గోల్డ్ మళ్లీ 1,700 డాలర్ల ఎగువ స్థాయికి చేరుకోగా.. సిల్వర్ 20 డాలర్లు దాటింది. అమెరికన్ డాలర్ విలువతోపాటు ఆ దేశ బాండ్ల రిటర్నుల రేటు తగ్గడం అంతర్జాతీయంగా విలువైన లోహాలకు డిమాండ్ మళ్లీ పెరిగింది. మంగళవారం ఒకదశలో బంగారం 1,722 డాలర్ల స్థాయికి పెరగగా.. వెండి 21 డాలర్ల ఎగువన ట్రేడైంది. ఈ లెక్కన బుధవారం దేశీయంగా బంగారం, వెండి రేటు మరింత పెరిగే అవకాశాలున్నాయి.